భారత్కు దెబ్బ మీద దెబ్బ : మార్చిలో నగదు 'విత్ డ్రా' ఆల్ టైమ్ రికార్డ్.. దేనికి సంకేతం..?
ఓవైపు విజృంభిస్తోన్న వైరస్.. మరోవైపు ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. ప్రస్తుతం ప్రపంచానికి ఈ రెండు పెద్ద సవాళ్లుగా మారాయి. వైరస్ను నియంత్రిస్తూనే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే అవకాశాలపై అన్ని దేశాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ వస్తు,సేవల ఉత్పత్తులపై గణనీయంగా ప్రభావం చూపించడంతో... రానున్న రోజుల్లో సప్లై చైన్పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగం కూడా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిపై లాక్ డౌన్ ప్రభావం చూపించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలు తమ ఖాతాల్లోని డబ్బులను భారీ మొత్తంలో విత్ డ్రా చేస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్తో ప్రభుత్వ ఖజానాలే ఖాళీ అయిపోతున్న తరుణంలో బ్యాంకుల్లో ప్రజల సేవింగ్స్ కూడా ఖాళీ అయిపోతే మరింత విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.
నగదు విత్ డ్రా.. ఆల్ టైమ్ రికార్డు
లాక్ డౌన్ తర్వాత బ్యాంకులు,ఏటీఎంల నుంచి ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటున జరిగిన నగదు విత్ డ్రా కంటే ప్రస్తుతం జరుగుతున్న విత్ డ్రాలు నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.దీంతో ప్రజల్లో నేరుగా వినియోగంలోకి వచ్చిన డబ్బు విలువ మార్చి నెలలో రూ.86,500కోట్లకు చేరి ఆల్ టైమ్ గరిష్ట రికార్డును నమోదు చేసింది. మొత్తం కరెన్సీ రూ.23,41,851లో ఇంత భారీ స్థాయిలో నగదు ప్రత్యక్ష సర్క్యులేషన్లోకి రావడం ఇదే మొదటిసారి.
మార్చి నెలలో ఇలా పెరిగిన విత్ డ్రాయల్స్..
రాష్ట్రలు తమ పరిధిలో లాక్ డౌన్ విధించుకోవడానికి కొద్ది రోజుల ముందు.. అంటే మార్చి 13 నాటికి దేశవ్యాప్తంగా బ్యాంకులు,ఏటీఎంల ద్వారా రూ.52,524 నగదును ప్రజలు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాతి పక్షం రోజుల్లో.. అంటే మార్చి 27 నాటికి మరో రూ.33,539కోట్లు ఉపసంహరించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ప్రజల్లో సర్క్యులేట్ అవుతున్న నెలవారీ సగటు నగదు పెరుగుదల రూ.23,895 కోట్లకు పెరిగింది. 2019-20లో ప్రజల్లో ఉన్న కరెన్సీ 14 శాతం లేదా రూ .2,86,741 కోట్లు పెరిగి 23,41,851 కోట్లకు చేరుకుంది.
ఎందుకిలా జరిగింది...
వ్యవస్థలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నుండి బ్యాంకుల వద్ద ఉన్న నగదును తీసివేయగా మిగిలింది ద్వారా ప్రజల వద్దనున్న కరెన్సీ. ప్రజల్లో చెలామణిలో ఉన్న కరెన్సీ వినియోగదారులు మరియు వ్యాపారాల మధ్య లావాదేవీలకు భౌతికంగా ఉపయోగించే నగదును సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే, ప్రజలతో కరెన్సీ అనేది వ్యక్తులు కలిగి ఉన్న నగదు పరిమాణం. లాక్ డౌన్ కంటే ముందే ప్రజలు ఆ పరిణామాలను పసిగట్టారు. షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్స్ మూసివేయడం.. విదేశీ విమానాల రాకపోకల బంద్ దిశగా చర్యలు తీసుకోవడం ఇవన్నీ ప్రజల్లో భయాందోళనను పెంచాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు పెద్ద మొత్తంలో తమ ఖాతాల్లోని డబ్బును ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు.
ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు..
సాధారణ రోజుల్లో డబ్బును ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడనివాళ్లు కూడా కరోనా పరిస్థితుల్లో డబ్బులను ఉపసంహరించుకున్నారని ఇండియా రేటింగ్ చీఫ్ ఎకనమిస్ట్ డీకె పంత్ అభిప్రాయపడ్డారు. 'బుల్విప్' ఎఫెక్ట్ కూడా కరెన్సీ డిమాండ్ పెరిగేందుకు దారితీస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల డిమాండ్లో మార్పులు కొత్త డిమాండ్కు అనుగుణంగా ఎక్కువ వస్తువులను ఆర్డర్ చేసేందుకు కంపెనీలను ప్రేరేపించినప్పుడు సప్లై చైన్పై ఇటువంటి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. గతంలో నవంబర్ 2016లో పెద్ద నోట్ల రద్దు సందర్భంగా రూ.9లక్షల కోట్ల మేర నగదు సర్క్యులేషన్ పడిపోగా.. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా కరెన్సీ సర్క్యులేషన్ పెరుగుతూ వస్తోంది.