మహాత్ముడుని హత్య చేసిన గాడ్సే పేరు మీద వెబ్సైట్
మీరట్: జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పేరు మీత ఓ వెబ్సైట్ను ప్రారంభించారు. గాడ్సేను ఉరితీసిన రోజు నవంబర్ 15న బలిదాన్ దివస్గా జరుపుకుంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ 'నాథురాం గాడ్సే- ఏ ఫర్గాటెన్ హీరో' పేరిట ఓ వెబ్సైట్ను లాంఛ్ చేసింది.
ఈ వెబ్సైట్లో గాడ్సేకు సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అంతేకాదు గాడ్సే పేరు మీదట హిందూ మహాసభ కార్యాలయాల్లో యాగాలను సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ మున్నా కుమార్ మాట్లాడుతూ దేశ విభజనకు గాంధీ కారణమయ్యాడనే కారణంతోనే గాడ్సే హత్యకు పాల్పడ్డాడని తెలిపారు.
గాంధీ బ్రతికుంటే భవిష్యత్తులో దేశం ఇంకా ముక్కలవుతుందని గాడ్సే గ్రహించాడని పేర్కొన్నారు. గాడ్సే త్యాగానికి గుర్తుగా నవంబర్ 15ను బలిదాన్ దివస్గా అఖిల భారత హిందూ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు గాడ్సేకు సంబంధించిన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలనే డిమాండ్తో రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు హిందూ మహాసభ ప్రకటించింది.
హిందూ మహాసభ లాంచ్ చేసిన గాడ్సే వెబ్సైట్లో గాడ్సే, అతని సోదరుల రచనలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గాడ్సే వెబ్సైట్ నిర్వహణకు ఆరుగురు ఐటీ నిపుణులను నియమించినట్లు పేర్కొన్నారు.