'ఫేక్' వార్త రాస్తే అంతే సంగతి: తేల్చి చెప్పిన కేంద్రం, జర్నలిస్టులు అలర్ట్?
న్యూఢిల్లీ: జర్నలిస్టులంతా ఇక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఉద్దేశపూర్వకంగానో.. పొరపాటునో.. ఒక తప్పుడు వార్త రాశారంటే.. ఆపై వారి జర్నలిస్టు అక్రిడేషన్ను రద్దు చేసేందుకు రంగం సిద్దమైంది. వార్త తీవ్రతను బట్టి అక్రిడేషన్ను శాశ్వతంగా రద్దు చేసేందుకు కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సోమవారం సాయంత్రం కేంద్రం నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. ఫేక్ వార్తా?.. లేక వాస్తవ కథనమేనా? అన్నది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) నిర్ణయిస్తాయని అని అందులో పేర్కొంది.
ఇన్ఫర్మేషన్&బ్రాడ్ కాస్టింగ్ మంత్రి స్మృతి ఇరానీ దీనిపై స్పందించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ).. ఈ రెండూ ప్రభుత్వ పరిధిలోనివి కాదని, కాబట్టే తప్పుడు కథనాలపై నిర్ణయం తీసుకునే అధికారం వాటికి ఇచ్చామని తెలిపారు.
తప్పుడు వార్తా కథనంపై ఫిర్యాదులు అందితే.. దానిపై విచారణ పూర్తయ్యేవరకు తాత్కాళికంగా వారి జర్నలిస్ట్ అక్రిడేషన్ రద్దు చేస్తారని కేంద్రం తెలిపింది. 15రోజుల్లోగా విచారణ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
కాగా, జర్నలిస్టుగా కనీసం ఐదేళ్ల అనుభవం ఉంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వారికి అక్రిడేషన్ అందుతుంది. ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయితే కనీసం 15ఏళ్ల అనుభవం ఉండాలి. ఎలక్ట్రానిక్&ప్రింట్ మీడియాల్లో తప్పుడు ప్రచారాలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్రం చెబుతోంది.
తప్పుడు వార్తా కథనాల విషయంలో ఒకసారి దోషిగా తేలితే.. తొలిసారి ఆర్నెళ్ల పాటు, రెండోసారి దొరికితే సంవత్సరం పాటు, మూడోసారి కూడా అదే రిపీట్ అయితే శాశ్వతంగా అక్రిడేషన్ రద్దు చేయనున్నారు. ఎన్నికలకు మరో ఏడాది గడువు మాత్రమే ఉన్న సమయలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.