రాబోయే 10 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో 5వేల షాహీన్బాగ్లు పుట్టుకొస్తాయి: భీమ్ ఆర్మీ చంద్రశేఖర్
రాబోయే 10 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో 5వేల షాహీన్బాగ్లు పుట్టుకొస్తాయని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. షాహీన్బాగ్ నిరసనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపిన ఆజాద్.. ఇది కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాదన్నారు. అందరం కలిసి రాజ్యాంగాన్ని,దేశ ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి సమీపంలో ఉన్న షాహీన్బాగ్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆజాద్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
సీఏఏ అనేది దేశ ప్రజలను మతప్రాతిపదికన విడగొట్టే ఒక తప్పుడు చట్టం అని ఆజాద్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని మహిళలు నడిపిస్తారని ఒకనాడు అంబేడ్కర్ చెప్పారని, దేశంలో రాజ్యాంగమే ప్రమాదంలో పడిపోయిన ప్రస్తుత తరుణంలో మహిళలే అందుకు నడుం కట్టారని అన్నారు.రికార్డు స్థాయి చలి ఉష్ణోగ్రతలు కూడా ఇక్కడి మహిళల సంకల్పాన్ని చెదరగొట్టలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. మన్ కీ బాత్ కార్యక్రమాలు నిర్వహించే ప్రధాని మోదీకి షాహీన్బాగ్లోని మహిళల మనసును మాత్రం ఎందుకు ఆలకించడం లేదని ప్రశ్నించారు. 38 రోజులుగా ఇక్కడి మహిళలు ఆందోళనలు చేస్తుంటే ప్రధాని ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు.
సీఏఏని వెనక్కి తీసుకోవడానికి తిరస్కరిస్తే.. ప్రభుత్వం నిరసనకారుల శవాల పైనుంచి దాటుకుని వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా ఎన్ని నిరసనలు వెల్లువెత్తినా సీఏఏని ఉపసంహరించకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్నోలో చేసిన ప్రకటించిన మరుసటి రోజే చంద్రశేఖర్ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. షాహీన్బాగ్ నిరసనలో భాగంగా ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన 'హమ్ దేఖెంగే' కవితను నిరసనకారులు ఆలపించారు. చంద్రశేఖర్ ఆజాద్ వేదిక వద్దకు రాగానే.. వాళ్లంతా మరింత బిగ్గరగా హమ్ దేఖెంగే అని నినదించారు.
కాగా, చంద్రశేఖర్ ఆజాద్ గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేశారన్న కారణంతో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీలోని స్థానిక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆంక్షలు విధించింది. అయితే బెయిల్ షరతులను సవరించాలని ఆజాద్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్తో ఏకీభవించిన న్యాయస్థానం వైద్యకారణాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం ఢిల్లీని సందర్శించడానికి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన షాహీన్బాగ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.