జస్టిస్ ఫర్ కాజల్ : గుజరాత్లో మరో 'నిర్భయ'.. యువతిపై నలుగురి గ్యాంగ్ రేప్, హత్య..
నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చి కొద్ది రోజులు కూడా గడవలేదు.. అప్పుడే మరో నిర్భయ తరహా ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. గుజరాత్లోని మొదసా జిల్లా సైరా గ్రామంలో 19 ఏళ్ల ఓ దళిత అమ్మాయిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆమెపై గ్యాంగ్రేప్కి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఆమె మృతదేహం మెడకు తాడు కట్టి ఓ చెట్టుకు వేలాడదీశారు.
వివరాల్లోకి వెళ్తే.. మొదసా జిల్లా సైరా గ్రామానికి చెందిన యువతి(19) డిసెంబర్ 31వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. మరుసటి రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అక్కడి పోలీసులు వారిని పట్టించుకోలేదు. ఇంటికొచ్చిన తర్వాత బాధితురాలి సోదరి తల్లిదండ్రులతో అసలు విషయం చెప్పింది. డిసెంబర్ 31న మొదసా పట్టణానికి వెళ్లి తిరిగొస్తుండగా.. భీమల్ భర్వాద్ అనే వ్యక్తి అక్కను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నట్టు చెప్పింది. ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని తనను బెదిరించినట్టు తెలిపింది. దీంతో మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. స్థానిక ఎస్ఐ ఎన్ఎల్ రబారి.. ఆమె తన బాయ్ఫ్రెండ్తో పారిపోయి వివాహం చేసుకుందని, కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని అన్నాడు.
ఇదే క్రమంలో జనవరి 5న గ్రామంలోని ఓ చెట్టుకు ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె తల్లిదండ్రులను అక్కడికి పిలిపించారు. అయితే మృతదేహాన్ని తీసుకునేందుకు వారు నిరాకరించారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని,ఇది కచ్చితంగా హత్యేనని ఆరోపించారు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించగా.. ఆమెపై గ్యాంగ్ రేప్ చేసి,హత్య చేసినట్టు తేలింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీసినట్టు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా భీమాల్ భర్వాద్,దర్శన్ భర్వాద్,సతీశ్ భర్వాద్,జిగర్ అనే నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాకే బాధితురాలి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు.
బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ 'జస్టిస్ ఫర్ కాజల్' పేరుతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ జనరల్ మయాంక్ సిన్హా తెలిపారు.