మానవత్వం మరిచిన 108 సిబ్బంది: బిడ్డ చనిపోయిందని రోడ్డుపై దించేశారు
భువనేశ్వర్: వారం రోజుల క్రితం ఒడిశాలో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో పాటు పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశాలో 108 సిబ్బంది మానవత్వాన్ని మరిచిన సంఘటన మరొకటి జరిగింది.
మల్కన్గిరి జిల్లాలో ఓ వ్యక్తి తన ఏడేళ్ల కూతురి శవాన్ని భుజాన వేసుకుని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. చిన్నారిని అంబులెన్స్లో మల్కన్ గిరి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే బాలిక చనిపోయినట్లు గుర్తించిన అంబులెన్స్ సిబ్బంది నడిరోడ్డు మీదే వాళ్లను దించేశారు.
వివరాల్లోకి వెళితే... ఏడేళ్ల బర్షా ఖేముదు ఆరోగ్యం విషమించడంతో అప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్న మిథాలి ఆసుపత్రి నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో చిన్నారిని అంబులెన్సులో తీసుకెళ్తుండగా దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఆ విషయం తెలిసిన అంబులెన్సు డ్రైవర్ వెంటనే తమను దించేశాడని బాలిక తండ్రి దీనబంధు ఖేముదు చెప్పారు. భార్యాభర్తలిద్దరూ కూతురి శవాన్ని మోసుకుంటూ సమీపంలోని గ్రామానికి వెళ్లడంతో ఏమైందని అక్కడి గ్రామస్తులు అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మరో వాహనంలో ఆ కుటుంబాన్ని వారి గ్రామంలో వదిలిపెట్టాలని వారు బీడీఓను, వైద్యాధికారులను కోరారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ కె. సుదర్శన్ చక్రవర్తి దృష్టికి వెళ్లింది. వెంటనే దీనిపై విచారణ జరపాల్సిందిగా చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ మిశ్రాను ఆదేశించారు.
అంబులెన్స్ డ్రైవర్, ఫార్మాసిస్ట్, వాహనంలో ఉన్న మరో వ్యక్తిపై మల్కన్గిరి పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. డ్రైవర్ చేసినది పూర్తిగా చట్ట విరుద్ధమని, నేరపూరిత నిర్లక్ష్యమని కలెక్టర్ చక్రవర్తి పేర్కొన్నారు. అతడితో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.