తక్కువ సమయంలోనే 12 లక్షల మంది తరలింపు : నవీన్ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ
భువనేశ్వర్ : సార్వత్రిక ఎన్నికల వేళ ఓ వైపు నేతల మధ్య మాటల మంటలు అగ్గిరాజేస్తుంటే .. మరోవైపు ప్రశంసలు, పొగడ్తలతో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ సైక్లోన్ ఫణితో ఒడిశా, బెంగాల్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ప్రధానిగా మోదీ .. బెంగాల్, ఒడిశా సీఎంలతో మాట్లాడి, రివ్యూ చేయాలి. అయితే ఫైర్ బ్రాండ్ మమతతో మోదీకి పొసగకపోవడంతో వారి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఒడిశా సీఎం నవీన్తో మోదీకి సఖ్యత ఉండటంతో ప్రశంసలు పొగడ్తలు కురుస్తోన్నాయి.
నవీన్ భేష్ ..
ఫణి రక్కసి ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఒడిశా సర్కార్ సహాయ, పునరావాస చర్యలు భేషుగ్గా చేపట్టారని ప్రధాని మోదీ .. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్పై ప్రశంసలు కురిపించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ గణేశ్ లాల్, సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్తో కలిసి పరిశీలించారు. పూరీ, కుర్దా, కటక్, జగతిసింగ్ పూర్, జైపూర్, కేంద్రపర, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత పునరావాస చర్యలపై సీఎం పట్నాయక్తో కలిసి అధికారులతో సమీక్షించారు.
సమర్థంగా విధుల నిర్వహణ
తుఫాన్ తర్వాత నవీన్ ప్రణాళిక ప్రకారం పనిచేశారని మోదీ గుర్తుచేశారు. తక్కువ సమయంలోనే 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. తీరప్రాంత ప్రజల కోసం అన్ని చర్యలు పటిష్టంగా అమలు చేశారని పొగిడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు .. ప్రతి ఒక్కరు తమ విధులను సమర్థవంతంగా నిర్వరించారని మోదీ పేర్కొన్నారు. అందరూ ఒకరికొకరు సమన్వయం చేసుకొని .. కలిసికట్టుగా పనిచేశారని తెలిపారు.
ప్రజలారా .. సెల్యూట్
ఒడిశా ప్రభుత్వం జారీచేసిన ఆజలను తీరప్రాంత ప్రజలు తూ.చా తప్పకుండా పాటించారని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మత్య్సకారులు, మహిళలు ప్రభుత్వం ఆదేశాలను పాటించి .. ప్రాణనష్ట తీవ్రతను తగ్గించారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇళ్లను వదలేయమని కోరితే ప్రజలు అంగీకరించరని .. కానీ ఒడిశా ప్రజలు సహకరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
మరో రూ.381 కోట్లు
ఫణి తుఫాన్ కోసం ముందస్తుగా రూ. వెయ్యి కోట్లను కేంద్రం మంజూరు చేసింది. తర్వాత 381 కోట్లను ఒడిశా డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అందజేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తుఫాను ప్రభావంతో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడ్డవారికి రూ.50 వేలు అందజేస్తామని పేర్కొన్నారు.