పాయింట్ బ్లాక్ లో పెట్టి డాక్టర్ హత్య
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ వైద్యుడు దారుణ హత్యకు గురైనాడు. గుర్తు తెలియని దుండగులు ఆయనను పాయింట్ బ్లాక్ రేంజ్ లో గన్ పెట్టి కాల్చి చంపి పరారైనారు. వైద్యుడు విధుల్లో ఉండగానే ఈ దారుణం జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు.
పోలీసు అధికారుల కథనం మేరకు బీహార్ లోని గయా జిల్లాకు చెందిన సునీల్ కుమార్ సింగ్ (40) ఉత్తరాఖండ్ చేరుకుని జోష్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఆయన విధులకు హాజరై పిల్లలకు వైద్యం అందిస్తున్నాడు.
ఆ సందర్బంలో ఆసుపత్రిలోకి చోరబడిన దుండగులు అందరూ చూస్తుండగానే వైద్యుడు సునీల్ కుమార్ సింగ్ మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో వైద్యుడు అక్కడికక్కడే మరణించాడు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది, సంఘటనా స్థలంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు. వైద్యుడి హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు.