27వేల కోట్లతో 19విమానాశ్రయాలు, ఏపీలో రెండు: అశోక్ గజపతిరాజు
న్యూఢిల్లీ: పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. దేశంలో 19 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. ఇందులో కొన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో వస్తాయని చెప్పారు.
గోవాలోని మోపా, మహారాష్ట్రలో నవీ ముంబై, సింధుదుర్గ్, ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం, దగదర్తి, కర్ణాటకలో హసన్, కేరళలో కన్నూర్, గుజరాత్లో ధోలెరాలో నిర్మించే విమానాశ్రయాలు పీపీపీ పద్ధతిలో వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాలూ భాగం పంచుకుంటాయని తెలిపారు. వీటి నిర్మాణానికి మొత్తం రూ.27,000 కోట్ల పెట్టుబడి అవసరమని పేర్కొన్నారు.
శరవేగంగా విమానయానం
దేశీయంగా విమానయాన రంగం శరవేగంతో వృద్ధి చెందుతోందని, ఈ స్థాయిలో నైపుణ్యాలు అభివృద్ధి చెందకపోయినా, ప్రయాణికుల భద్రతలో రాజీపడటం లేదని అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. 2014లో దేశీయంగా 395 విమానాలు సేవలు అందిస్తే.. ప్రస్తుతం 548కి పెరిగాయని తెలిపారు.
Recommended Video
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక...
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఏడాదికి సగటున 50 విమానాలు జతవుతూ వస్తున్నాయని వివరించారు. కాగా, దేశీయ విమానయాన రంగం టర్నోవర్ 2015-16లో రూ.1.50 లక్షల కోట్ల స్థాయికి చేరిందని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్సభలో వెల్లడించారు. దేశీయంగా సేవలు అందిస్తున్న విదేశీ విమానయాన సంస్థల టర్నోవర్ కూడా ఇందులో కలిసే ఉందన్నారు.
విమానాలతో పోటీపడుతున్న రైళ్లు
2015-16లో దేశీయ రైల్వేల టర్నోవర్ రూ.1.68 లక్షల కోట్లు కావడం గమనార్హం. 2016లో దేశీయంగా విమానాల్లో 11 కోట్ల మంది ప్రయాణించారని, అదే సమయంలో రైళ్లలోని ఏసీ బోగీల్లో ప్రయాణించిన వారి సంఖ్య 12 కోట్లని జయంత్ సిన్హా వివరించారు.
లాభాల బాటలో ఎయిరిండియా
గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియాకు రూ.215 కోట్ల నిర్వహణ లాభాలు వచ్చాయని, దీనివల్ల నికర నష్టాలు రూ.3,643 కోట్లకు తగ్గాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 2015-16లో నిర్వహణ లాభం రూ.105 కోట్లు కాగా, నికర నష్టాలు రూ.3,836.77 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. 2017 మార్చి 31 వరకు సంస్థ రుణాలు రూ.48,877 కోట్లుగా ఉన్నాయన్నారు.