మతాచారాన్ని పక్కనపెట్టి నలుగుర్ని కాపాడాడు(వీడియో)
సంగ్రూర్: మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టిన ఓ యువకుడు నలుగురు యువకుల ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే పంజాబ్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల ఇందర్ పాల్ సింగ్. సిక్కు అయిన అతడు, మతాచారం కన్నా మానవత్వమే మిన్న అని చాటి చెప్పాడు.
వివరాల్లోకి వెళితే.. గణేష్ నిమజ్జనం సందర్భంగా సునం గ్రామానికి చెందిన నలుగురు యువకులు గోడపై నిలుచున్నారు. అనుకోకుండా ఒకే సారి పెద్ద ఎత్తున నీరు రావడంతో అదుపుతప్పి వాళ్లు నీళ్లలో పడిపోయారు.
కాలువలో నలుగురు యువకులు చిక్కుకుని కొట్టుకుపోవడాన్ని ఓ యువకుడు గమనించాడు. వీరిని కాపాడటానికి తొలుత ఒక వైరుని వీళ్లకి అందించాడు. కానీ, అది తెగిపోవడంతో మరోదారిలేక అక్కడే గట్టుపై కూర్చున్న ఇంద్రపాల్ సింగ్ తన తలపాగాని తీసి అతనికి అందించాడు.
ఒడ్డు పైనే ఉన్న మరో సిక్కు యువకుడు ఆ తల పాగా సహాయంతో నలుగురు యువకులు నీళ్లలో కొట్టుకు పోకుండా ఒక్కొక్కరిని ఒడ్డుకు లాగి కాపాడాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోని చూసిన వారందరూ ఇందర్ పాల్ చూపించిన మానవత్వానికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కాగా, ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఇందర్ పాల్ సింగ్ జివాన్ సింగ్, కమల్ ప్రీత్, ఇంద్ తివారీలుగా గుర్తించారు. వీరందరూ 18 నుంచి 25ఏళ్ల లోపువారే. ఇటీవల న్యూజిలాండ్లో కూడా ఓ సిక్కు యువకుడు తన తలపాగాను తీసి రోడ్డు ప్రమాదానికి గురైన ఓ బాలుడ్ని కాపాడాడు.