చైనా దూకుడుకు చెక్:భారత్ కూటమిలో ఆస్ట్రేలియా - మలబార్ విన్యాసాలకు ఆసీస్ నౌకాదళం
ఇండో-పసిఫిక్ రీజియన్ పై పట్టుకోసం పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతోన్న చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక అడుగు ముందుకేసింది. 'మలబార్ ఎక్సర్సైజ్' పేరుతో భారత్, అమెరికా, జపాన్ లు చాలా కాలంగా నిర్వహిస్తోన్న నౌకా విన్యాసాల్లో ఈసారి ఆస్ట్రేలియా కూడా పాల్గొనబోతున్నది.
Recommended Video
షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్
రక్షణ శాఖ ప్రకటన..
సముద్ర భద్రతకు సంబంధించి ఇతర దేశాల సహకారాన్ని పెంపొందిచేలా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలం అవుతున్నాయని, ఆస్ట్రేలియాతో రక్షణ సహకారం పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది ‘మలబార్ 2020' విన్యాసాల్లో ఆ దేశ నౌకాదళం కూడా పాల్గొంటుందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ తో సంబంధాల రీత్యా ఇది తమకెంతో గర్వకారణమైన, ముఖ్యమైన ఘట్టమని ఆసీస్ సర్కారు ప్రకటన చేసింది.
ఎప్పుడు ఎక్కడ జరుగుతాయంటే..
తొలిసారిగా 1992లో ప్రారంభమైన మలబార్ మెగా నౌకా విన్యాసాల్లో భారత్, అమెరికా నౌకలు పాల్గొన్నాయి. 2015లో జపాన్ కూడా ఈ కూటమిలో భాగమై, తన నౌకదళాలను విన్యాసాలకు పంపింది. చివరిగా, 2019 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ తీరంలో మూడు దేశాల సంయుక్త విన్యాసాలు జరిగాయి. తాజాగా 2020 మలబార్ విన్యాసాలు రెండు దశల్లో.. నవంబర్ 3 నుంచి 6 వరకు, తిరిగి నవంబర్ 17 నుంచి 20 వరకు జరుగుతాయి. ఒక భాగం విన్యాసాలను బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులకు ఉత్తరాన, మరో భాగం విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహిస్తారు.
చైనాకు చెక్ పెట్టేందుకే..
ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నావిగేషన్ పరిరక్షించడమే భారత్, అమెరికా, జపాన్, ఆస్టేలియాల లక్ష్యమని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తద్వారా ఈ రీజియన్ లో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పనున్నట్లు పరోక్షంగా హెచ్చరించారు. ఈనెల 6న జపాన్ రాజధాని టోక్యోలో భారత్, అమెరికా, జపాన్, ఆస్టేలియా విదేశాంగ మంత్రులు సమావేశమై మలబార్ ఎక్సర్సైజ్ పై కీలక చర్చలు జరిపారు. ఈ నెల 26-27తేదీల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగనున్నాయి. ఆ సందర్భంలోనే జియో-ప్రాదేశిక ఒప్పందం (బీఈసీఏ)పై సంతకాలు జరుగవచ్చని తెలుస్తోంది. భారత్, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నాలుగు శక్తిమంతమైన దేశాలు కలిసి మెగా నౌకా విన్యాసాలు జరుపడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
క్రిస్మస్ నాటికి చెదపురుగులు నాశనం-జగన్కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్