పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా బదులిచ్చిన భారత సైన్యం!
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పదే పదే చొరబాట్లు, దాడులకు తెగబడుతూ.. భారత సైనికులు, పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాకిస్తాన్కు భారత సైన్యం దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పింది. ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ.. మన సైనికులను బలిగొంటున్న దాయాది దేశానికి దాని భాషలోనే బదులిచ్చింది.
కశ్మీర్లోని యూరీ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ చెక్పోస్టును భారత సైన్యం నేలమట్టం చేసింది. వరుసగా రెండు రోజుల్లో పాకిస్తాన్కు చెందిన రెండు చెక్పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా మేందార్ సెక్టార్లోని నియంత్రణ రేఖ సమీపంలో పాక్ సైన్యానికి చెందిన స్థావరాన్ని భారత సైన్యం పేల్చిపారేసింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇటీవల సుంజువాన్ ఆర్మీ క్యాంప్పై, శ్రీనగర్లోని సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడికి యత్నించడం, ఆసుపత్రి నుంచి ఉగ్రవాదిని విడిపించేందుకు కాల్పులు జరపడం లాంటి దుందుడుకు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇవన్నీ చేయడమే కాకుండా.. యూరీ దాడి ఘటన తర్వాత భారత్ సర్జికల్ స్ట్రయిక్స్కు దిగినట్లు.. మళ్లీ సర్జికల్ స్రయిక్స్ గనుక చేస్తే సహించబోమంటూ పాక్ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
సుంజవాన్ ఆర్మీ క్యాంప్పై ఉగ్రదాడి తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. అతి త్వరలోనే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లిస్తుందని కూడా హెచ్చరించారు. సర్జికల్ స్ట్రయిక్స్తోపాటు పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
అందుకు తగ్గట్లుగానే.. భారత సైన్యం పాకిస్తాన్పై ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. పాకిస్తాన్ చెక్పోస్టులను ధ్వంసం చేసుకుంటూ ముందుకెళుతోంది. ఏకపక్ష కాల్పులకు తోడు పాక్ సైన్యం ఉగ్రవాదుల సహాయంతో దాడులకు తెగబడవచ్చన్న సమాచారంతో సరిహద్దుల వెంట భద్రతను మరింత పటిష్టం చేసినట్లు భారత సైన్యం పేర్కొంది.