బీజేపీ ఎమ్మెల్యే భర్త రచ్చ: చలానా కట్టమన్నందుకు చెంపదెబ్బ..
ఇద్దరు కలిసి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మర్యాదగా తమవ్యక్తిని వదిలిపెట్టాలని, చలానా కట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేతో పేచీ పెట్టుకున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే భర్త ఓ పోలీస్ అధికారిపై చేయి.
జైపూర్: చాలా సందర్బాల్లో ఎమ్మెల్యేలు తమ అధికార ప్రతాపం అంతా పోలీసుల మీద చూపిస్తుంటారు. కారాణాలేవైనా తమ మద్దతుదారులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు ప్రశ్నించకూడదు. ప్రశ్నించినా జరిమానా లాంటివి లేకుండా వదిలేయాలి. ఇది కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు.
తాజాగా రాజస్థాన్ లోని కోటా జిల్లా మహవీర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త వెళ్తున్న ఓ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా చలానా రాశారు. సదరు కార్యకర్త విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు చేరవేయడంతో.. అప్పటికప్పుడు ఎమ్మెల్యే చంద్రకాంత మేఘవాల్ తన భర్తతో సహా అక్కడ వాలిపోయింది.
ఇద్దరు కలిసి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మర్యాదగా తమవ్యక్తిని వదిలిపెట్టాలని, చలానా కట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేతో పేచీ పెట్టుకున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే భర్త ఓ పోలీస్ అధికారిపై చేయి కూడా చేసుకున్నారు.
ఇంత జరిగిన కేసుకు సంబంధించి ఏ ఒక్కరిని ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. డీఎస్పీ కునారత్ జాత్ ఇప్పటికే సీనియర్ పోలీస్ అధికారులతో ఈ వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎంపీ బిర్లా జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేయాలని, కేసులు లేకుండా రాజీ కుదుర్చుకోవాలని డీఎస్పీ చెప్పినట్లు సమాచారం.
కాగా, విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే భర్త చేయి చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఒత్తిడితోనే సదరు ఎమ్మెల్యే భర్త మీద చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.