బలగాల ఉపసంహరింపు: 9వ రౌండ్ కమాండర్ లెవల్ భేటీపై చైనా ఏమందంటే?
బీజింగ్: ఓ వైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటోంది చైనా. తాజాగా, చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ సైనికాధికారి టాన్ కెఫీ మాట్లాడుతూ.. తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి ఇరు పక్షాల భద్రతా బలగాలను ఉపసహరించుకునేందుకు భారత్తో చర్చల కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
ఇప్పటికే భారత్, చైనాల మధ్య ఎనిమిది రౌండ్ల కార్ప్ కమాండర్ లెవల్ చర్చలు జరిగాయి. సరిహద్దులో శాంతి పరిస్థితులను మళ్లీ తీసుకొచ్చేందుకు ఇరు దేశాలకు సంబంధించిన బలగాలను ఉపసంహరించుకునేందుకు ఈ చర్చలు జరిగాయి. కాగా, చైనా బలగాలను ఉపసంహరించేందుకు సిద్ధమేనంటూ మరోవైపు సరిహద్దులో సైనిక కార్యకలాపాలను పెంచడం పట్ల భారత్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
మిలిటరీ, డిప్లమాటిక్ ఛానల్స్ ద్వారా సరిహద్దులో శాంతి పరిస్థితులు నెలకొల్పేందుకు భారత్తో చైనా సంప్రదింపులు జరుపుతూనే ఉందని టాక్ కెఫీ తెలిపారు. సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు చైనా సుముఖంగా ఉందని, భారత్ కూడా తమతో కలిసి వస్తుందని ఆయన అన్నారు. కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు ఇందుకు ముందడుగు వేస్తాయన్నారు.
మే నెల నుంచి సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు చైనాతో మిలిటరీ లెవల్ సమావేశాలను జరిపి సరిహద్దులో బలగాల ఉపసంహరణకు భారత్ పిలుపునిచ్చింది. చైనా మాత్రం బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తూనే ఎల్ఏసీ వెంబడి పలుచోట్ల మళ్లీ తమ బలగాలను మోహరిస్తుండటంతో శాంతి చర్చలు కొలిక్కి రావడం లేదు.
కాగా, డిసెంబర్ 19న చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులను పర్యవేక్షించేందుకు కమాండర్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్ కు కొత్త జనరల్ను చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నియమించారు. ఇక భారత్, చైనాల మధ్య జరిగే 9వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఏమేర ఫలితాలను ఇస్తాయో వేచిచూడాలి.