వాళ్లను చూడండి రైల్వే ట్రాక్ మీదే...500 రైళ్లు వచ్చినా కదలరు:పంజాబ్ రైలు ప్రమాదంపై సంచలన వీడియో
పంజాబ్:అమృతసర్ దసరా వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రావణ దహన వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం కారణంగా సుమారు 61 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదానికి కారణం మీరంటే మీరని స్థానికులు, రైల్వే శాఖల మధ్య పరస్పరం ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఘటనా స్థలంలో ప్రమాదానికి ముందు అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగాలకు సంబంధించి బైటపడిన ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. స్థానిక కాంగ్రెస్ నేత, ఈ వేడుకల నిర్వాహకుడు అయిన ఒక వ్యక్తి తన ప్రసంగంలో జనాలు ఇలా రైల్వే ట్రాక్ పై నిలబడి ఉండటాన్ని గురించి గొప్పగా తన ప్రసంగంలో ప్రస్తావించడమే అందుకు కారణం. వివరాల్లోకి వెళితే...
అమృతసర్ రైలు ప్రమాదం దుర్ఘటనలో తమ శాఖ తప్పేమి లేదని రైల్వే శాఖ వీళ్లు వాదిస్తుంటే...రైలు వస్తున్నట్లు హారన్ తో నైనా కనీసం ఎలాంటి హెచ్చరిక చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘోర రైలు ప్రమాదం జరగడానికి కొద్ది సమయం ముందు ఇక్కడ దసరా వేడుకలను నిర్వహిస్తున్న స్థానిక కాంగ్రెస్ నేత తన ప్రసంగం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక్కడి దసరా వేడుకలను స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారుడు తన ఆధ్వర్యంలోనే నిర్వహించాడు. కాగా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ హాజరయ్యారు. ఆమెను వేదిక మీదకు ఘనంగా ఆహ్వానించి పూలమాలలతో సత్కరించిన నిర్వాహకుడు ఈ సందర్భంగా మైక్ తీసుకొని మాట్లాడుతూ...మేడం...మీరే చూడండి...ఈ వేడుకకు వచ్చిన వాళ్లు రైల్వే ట్రాక్ మీద నిలబడిన విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. మీ కోసం దాదాపు కొన్ని వందల మంది ప్రజలు రైల్వే ట్రాక్పై నిలబడ్డారు. 500 రైళ్లు వచ్చినప్పటికీ.. వాళ్లు మాత్రం అక్కడ నుంచి కదలరు"...అంటూ ఆ విషయాన్ని గొప్పగా చెప్పాడు.
అయితే ఆ తరువాత కొద్దిసేపటికే ఈ ఘోర రైలు ప్రమాదం జరగగా...ఆ దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఇక ఆ దసరా వేడుకల నిర్వాహకుడు, కౌన్సిలర్ కుమారుడు అదృశ్యమయ్యాడు. అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ సమీపంలో రావణ దహన వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు పురపాలక సంఘం నుంచి, రైల్వే అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. అలాగే పోలీసుల దగ్గర నుంచయినా సరే కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను కూడా తీసుకోలేదని తెలిసింది.
ఈ ప్రమాదంలో స్థానికుల తప్పిదమే ఎక్కువగా ఉన్నట్లు సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సైతం పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవజ్యోత్ కౌర్ ఏమన్నారంటే..."రావణ దహన వేడుకలు నిర్వహించిన దోబి ఘాట్ మైదానంలో చాలా స్థలం ఖాళీగా ఉంది...రావణుడు దిష్టిబొమ్మ కిందపడిపోకుండా ఉండేలా చాలా పటిష్టంగా దాన్ని కట్టడం జరిగింది...ఇది ప్రజల మీదకు పడిపోయే అవకాశమే లేదు...అయినా గానీ అది అలా పడుతుందేమోనన్న పుకార్లు అక్కడ వ్యాపించాయి. అయినా అక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు...ప్రజలు ట్రాక్ మీద నిలబడొద్దని...మైదానంలోకి రావాల్సిందిగా నిర్వాహకులు నాలుగైదు సార్లు ప్రకటనలు కూడా చేశారు"...అని చెప్పుకొచ్చారు.