బావిలో పెట్రోల్!: చేదుకునేందుకు జనం బారులు
పాట్నా: వేసవి కాలంలో నీళ్ల కోసం బావుల వద్ద జనం భారీ సంఖ్యలో బారులు కట్టడం చూస్తూనే ఉంటాం. అయితే, ఆ బావిలో పెట్రోల్ లాంటి చమురు లభిస్తే... ఇంకేముందు ఆ బారులు మరింత పెరిగిపోతాయి. బీహార్ రాష్ట్రంలో కూడా అదే జరిగింది.
బీహార్ రాష్ట్రంలోని గయలోని ఓ పాతబావిలో నీళ్ల కోసం బక్కెన వేస్తే నీళ్లు కాదు ఏకంగా పెట్రోల్ లాంటి చమురు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పాడుపడిన బావి కదా చాలా రోజుల్నుంచి నీళ్ల కూడా తోడ లేదు అందుకే నీళ్లు ఇలా ఉంటాయేమో అని మరోసారి తోడారు.
మళ్లీ చమురే వచ్చింది. దీంతో ఇది నిజంగా పెట్రోల్ అని ఊరు ఊరంతా బిందెలు, బకెట్లు, డబ్బాలతో బావి దగ్గరికి క్యూ కట్టారు. విషయం తెలుసుకున్న పక్క గ్రామస్థులు కూడా బావి వద్దకు చేరుకున్నారు. పోటీ పడి మరీ బకెట్లతో ఆయిల్ తోడుకున్నారు.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి పోలీసుల చెవిన పడింది. పెద్ద ఎత్తున పోలీసులు బావి దగ్గరికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. బావి దగ్గరికి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో గ్రామస్థులు కాస్త వెనకడుగేసి బావి దగ్గర్నుంచి వెళ్లిపోయారు. అయితే బీహార్లో బావిలో నీళ్లకు బదులు చమురు లభించడం ఇదే మొదటి సారి అని స్థానికులు చెబుతున్నారు.
కాగా, ఈ సమాచారం తెలియడంతో బీహార్ ప్రభుత్వం కూడా స్పందించింది. బావిలో పెట్రోల్ తరహా చమురు లభిస్తున్నట్టు తెలిసిందని, దీంతో బావిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఇది పెట్రోలా.. కాదా? అని నిర్ధారించడానికి త్వరలో ప్రభుత్వం తరపున నిపుణులు, అధికారులు రానున్నారని పోలీసు అధికారి తెలిపారు.