ఇక్కడ గాడిదపై ఊరేగితే మగపిల్లలు పుడతారు!
అహ్మదాబాద్: ఓ వైపు దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ.. మారుమూల గ్రామాల్లో మాత్రం మూఢ నమ్మకాలు అలాగే ఉండిపోతున్నాయి. స్త్రీ, పురుషులు సమానమని వాదిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామం.
దేశంలో ఇంకా చాలా చోట్ల మగపిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేసేవాళ్లున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ గ్రామంలో మాత్రం గాడిదలపై ఊరిగితే మగ పిల్లలు పుడతారనే వింత మూఢ నమ్మకం ప్రాచుర్యంలో ఉంది.
ఈ నేపథ్యంలోనే ప్రతీ హోలీ పండగ రోజున జునాగఢ్ జిల్లా బోర్వావ్ గ్రామంలోని పురుషులు మాత్రం గాడిదల మీదకు ఎక్కి ఊరేగుతుంటారు. కాగా, బోర్వావ్ గ్రామంలో ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమట.
మగపిల్లలు పుట్టేందుకు పురుషులు చేయాల్సిన వ్రతం ఇదని స్థానికులు చెబుతుండటం విశేషం. మగ సంతానం లేని వారు హోలీ పండగ నాడూ గాడిద మీద వూరేగుతూ భిక్షాటన చేస్తారు. తొలుత స్థానికంగా ఉండే పక్షులు, జంతువుల ఆహారం కోసం ఈ పద్ధతిని మొదలుపెట్టారు.
అయితే రాను రాను అలా ఎక్కిన వారందరికీ మగపిల్లలు పుట్టడంతో గ్రామస్థులకు నమ్మకం పెరిగింది. ఈ గ్రామంలో రెండు గాడిదలుండగా.. దాని మీద ఎక్కేందుకు స్థానికులు పోటీ పడుతుంటారు. దీంతో వచ్చే ఐదేళ్ల వరకూ ఎవరు గాడిద మీద ఊరేగాలో ఇప్పుడే నిర్ణయించుకోవడం గమనార్హం. అంటే ఈ నమ్మకానికి ఆ ఊళ్లో ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. ఈ నమ్మకం మూఢ నమ్మకం అని ఎప్పుడు తెలుసుకుంటారో మరి ఈ గ్రామస్తులు.