ట్రిపుల్ తలాక్ బిల్లు వాయిదా: రాజ్యసభ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టకుండానే రాజ్యసభ సమావేశాలు ముగిశాయి. రాజ్యసభ శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆ బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Recommended Video
ట్రిపుల్ తలాఖ్ బిల్లు శుక్రవారం సభ ముందుకు వస్తుందని భావించిన తరుణంలో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెసు తమ తమ రాజ్యసభ సభ్యులకు విప్లు జారీ చేశాయి. శీతాకాలం పార్లమెంటు సమావేశాలు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో పార్టీలు ఆ విప్లు జారీ చేశాయి.
రాజ్యసభ ఎజెండాలో బిల్లును పొందుపరిచారు కూడా. అయితే, ప్రభుత్వ,, ప్రతిపక్షాల మధ్య బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే వచ్చింది. ఈ స్థితిలో బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుందా అనే అనుమానాలు నివృత్తి అయ్యాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
ప్రతిపక్షాలను ఒప్పించకుపోతే బిల్లును ఆమోదింపజేసుకోవడం ప్రభుత్వానికి కష్టమే అవుతుంది. ప్రభుత్వం మైనారిటీలో ఉంది. కాంగ్రెసు నేతృత్వంలో ఏకమైన ప్రతిపక్షాలు బిల్లును సమీక్ష కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కోరుతోంది.
ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చే పద్ధతిని నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఆ బిల్లును రూపొందించింది. అది లోకసభలో ఆమోదం పొందింది. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ను అన్యాయంగా పేర్కొన్న నేపథ్యంలో ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికి ఈ బిల్లును తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.