మాణిక్ సర్కార్ ఇంటికి వెళ్ళిన బిప్లవ్ దేబ్, రామ్ మాధవ్, ఏమైందంటే?
అగర్తల:నాలుగు సార్లు త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన విశేష రాజకీయ అనుభవం ఉన్న మాణిక్ సర్కార్ సలహలను తమ ప్రభుత్వం తీసుకొంటుందని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందు బిప్లవ్ దేబ్ ప్రకటించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వరుస విజయాలు సాధించిపెట్టడంలో కీలక పాత్ర వహిస్తున్న రామ్ మాధవ్తో కలిసి ఆయన స్వయంగా మాణిక్ సర్కార్ ఇంటికి వెళ్లారు. సీఎంగా ఒకే గదిలో నిరాడంబరంగా గడిపిన మానిక్ తాజాగా సీపీఎం ఆఫీసు కార్యాలయంలోని రెండు గదుల నివాసానికి మారారు.
బీజేపీ నేతలిరువురూ అక్కడే మానిక్ను కలిసి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. మాణిక్ సైతం వారితో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వారి మర్యాదపూర్వక ఆహ్వానాన్ని మన్నించారు. తప్పనిసరిగా వస్తానని చెప్పడమే కాకుండా ఆ మాటను నిలుపుకొన్నారు.
మాణిక్ సర్కార్ ఇరవై ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ అతి పేద సీఎంగానే నిలిచారు. సొంత కారు కానీ, ఇల్లు కానీ లేవు. కాళ్లకు సాదారణ చెప్పులే వేసుకునే వారు. నెలవారీ వేతనం పార్టీకే. కేవలం పార్టీ ఇచ్చే స్వల్ప మొత్తంతోనే ఆయన నిరాడంబర జీవితం గడిపేవారు.
సీఎం అయినప్పటికీ ఒకే గదిలో ఆయన భార్యతో కలిసి నివసించేవారు. తాజాగా ఆయన నివాసం సీపీఎం గెస్ట్ హౌస్కు మారింది. అక్కడ రెండు గదులన్నా ఎలాంటి హంగులూ ఆర్భాటాలు వద్దని మాణిక్ తేల్చిచెప్పేశారు. పార్టీ ఆఫీసులో ఏదైతే వండుతున్నారో అదే తింటామని, ప్రత్యేక వంటకాలు అవసరం లేదని వంటవాళ్లకు చెప్పారు. మానిక్, పాంచాలి భట్టాచార్య దంపతులకు సంతానం లేదు.