బీజేపీ భవితవ్యం ఆ మూడు సామాజిక వర్గాల చేతుల్లో..! వారి ఓటుబ్యాంకును కొల్లగొడితేనే మళ్లీ ఛాన్స్!
లక్నో: దేశ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ పూర్తిగా భిన్నం. అక్కడ అధిక శాతం సీట్లను గెలుచుకునే పార్టీ కేంద్రంలో అధికార పగ్గాలను అందుకుంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న లోక్ సభ స్థానాల సంఖ్య 80. ఇంత పెద్ద సంఖ్యలో లోక్ సభ సీట్లు ఉన్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. అందుకే- కేంద్రంలో అధికారంలో రావాలనుకున్న ప్రతి పార్టీ మొదట దృష్టి సారించేది యూపీ రాజకీయాలపైనే. ఎన్ని సీట్లను కొల్లగొడితే.. అంతగా కేంద్రంలో అధికార పీఠానికి దగ్గరవుతారు.
యూపీలో ఉన్న 80 లోక్ సభ స్థానాల్లో 2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీ 72 చోట్ల ఘన విజయాన్ని సాధించింది. బీఎస్పీ అడ్రస్ గల్లంతు అవ్వగా.. కాంగ్రెస్ రెండుస్థానాలకే పరిమితమైంది. బలమైన సమాజ్ వాది పార్టీ గెలిచింది అయిదుచోట్లే. మరో రెండు స్థానాలను బీజేపీ పొత్తు పార్టీ అప్నాదళ్ కైవసం చేసుకుంది. దీనితో బీజేపీ కేంద్రంలో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను అలవోకగా దాటేసింది.
యూపీ పాలిటిక్స్ : అఖిలేశ్, మాయా వైరివర్గాలతో కాంగ్రెస్ చెట్టపట్టాల్
ప్రస్తుతం అప్పటి సానుకూల పరిస్థితులు లేవు. బీజేపీ ఎదురీదుతోంది. దీనికి ప్రధాన కారణం.. శతృవులు ఒక్కటి కావడమే. సమాజ్ వాది పార్టీ-బహుజన సమాజ్ వాది పార్టీ పొత్తు పెట్టుకోవడం కమలనాథులకు మింగుడు పడని విషయం. ఈ రెండు పార్టీలు ఒక్కటైన తరువాత.. యూపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ వరుసగా అయిదుసార్లు జెండా పాతిన గోరఖ్ పూర్ లోక్ స్థానాన్ని కోల్పోవడమే దీనికి నిదర్శనం.
పైగా- ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత లోక్ సభ నియోజకవర్గం కూడా. అధికారంలో ఉండి కూడా యోగి.. తన సొంత స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయడం వల్ల జరిగిన గోరఖ్ పూర్ లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ మట్టి కరిచింది. ఎస్పీ-బీఎస్సీ ఉమ్మడిగా అభ్యర్థిని బరిలో దింపి, సాధించాయి. అదే ఫార్ములాను లోక్ సభ ఎన్నికల్లో అమలు చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-37, బీఎస్పీ-38 చోట్ల పోటీ చేయబోతున్నాయి.
ముస్లిం-యాదవ్-దళిత ఓటుబ్యాంకు కాంబినేషన్..
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడక కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. సీ-ఓటర్ చేసిన సర్వే ప్రకారం.. బీజేపీ కనీసం 47 లోక్ సభ స్థానాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటోందని తేలింది. ఈ 47 చోట్లా ముస్లిం, యాదవ్, దళితుల ప్రాబల్యం అధికంగా ఉంది. 50 శాతానికి పైగా ఓటుబ్యాంకు వారిదే. బీజేపీ నెగ్గాలంటే ఈ మూడు సామాజిక వర్గాలను ఆకట్టుకోవాల్సి ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. ఈ 47 స్థానాలే కాకుండా.. మిగిలిన నియోజకవర్గాల పరిధిలోనూ ముస్లిం, యాదవ్, దళితుల ఓట్ల శాతం 40 శాతం పైమాటే.
ఔను నేను కాపాలదారుడినే .. సాంగ్ విడుదల చేసిన మోదీ ..వీడియో
ఈ పరిస్థితుల్లో అణగారిన, అట్టడుగు, మైనారిటీల ఓటు బ్యాంకు మొత్తంగా ఎస్పీ-బీఎస్పీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని సీ-ఓటర్ సర్వే అభిప్రాయపడుతోంది. ముస్లిం-యాదవ్-దళిత ఓటు కాంబినేషన్ ఓటు బ్యాంకును ఎస్పీ-బీఎస్పీ కూటమి కొల్లగొట్టేయడం ఖాయమని అంచనా వేసింది. దళితుల కోసమే పుట్టిన పార్టీ బీఎస్పీ. దళిత ఓటుబ్యాంకు ఆ పార్టీకి వెన్నెముక. ఇక యాదవ సామాజిక వర్గంపై సమాజ్ వాది పార్టీకి బలమైన పట్టు ఉంది. ఎస్పీ అగ్ర నాయకత్వం కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినదే కావడం కలిసొచ్చే అంశం. 2014 ఎన్నికల్లో యూపీ ఓటర్లు నరేంద్రమోడీని చూసి ఓటు వేశారని, ఆ తరువాత ఆయన ఛరిష్మా కూడా తగ్గిందని, గోరఖ్ పూర్ రిజల్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని సీ-ఓటర్ సర్వే చెబుతోంది.
కీలకమైన ఆజంగఢ్, ఘోసీ, డొమారియా గంజ్, ఫిరోజాబాద్, జౌన్ పూర్, అంబేద్కర్ నగర్, బదోహీ, బిజ్నౌర్, మోహన్ లాల్ గంజ్, సీతాపూర్ లల్లో ముస్లిం-యాదవ్-దళిత ఓటు బ్యాంకు 60 శాతం మేర ఉంది. ఆజంగఢ్ స్థానం సమాజ్ వాది పార్టీకి పెట్టని కోట. గతంలో ములాయం సింగ్ యాదవ్ పలు మార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని ఎస్పీ, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేసి అధిగమించాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడానికి ఇదే ప్రధాన కారణం.
80 లోక్ సభ స్థానాల్లో 41 చోట్ల 2014లో ఎస్పీ-బీఎస్సీ వేర్వేరుగా పోటీ చేసి 60 శాతానికి పైగా ముస్లిం-యాదవ్-దళితుల ఓట్లను రాబట్టుకోగలిగాయి. మరో 21 స్థానాల్లో 50 నుంచి 60 శాతం వరకు, మిగలిన స్థానాల్లో 40 నుంచి 50 శాతం వరకు ఓట్లను రాబట్టుకున్నాయి. ఆయా చోట్ల ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే.. ఈ రెండు పార్టీలకు వేర్వేరుగా పోల్ అయిన ఓట్లు అధికం. వేర్వేరుగా పోటీ చేయడం వల్ల బీజేపీ లబ్ది పొందగలిగింది. దీన్ని పున:సమీక్షించుకున్న ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం.. బీజేపీకి కలవరపాటుకు గురి చేస్తోంది.