భారీ వర్షాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ముంచెత్తుతున్న వరదలు
ఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కర్ణాటక, అస్సాం, మేఘాలయ, కేరళ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరేం, త్రిపుర రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.
కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది. కేరళలో వరదల వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. దాదాపు లక్ష మంది ప్రజలు వరదల బారినపడ్డారు.
దిఫోలు నది ప్రమాద స్థాయిలో ప్రవహించడం వల్ల 37 జాతీయ ప్రధాన రహదారి కొంత మేర మునిగింది. కజిరంగ నేషనల్ పార్క్లో నీరు నిలిచింది. మణిపూర్లోని దాదాపు నలభై నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంఫాల్, కొండ ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సహాయక చర్యలు వేగవంతం చేయాలని మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఆదేశించారు. మిజోరాంలోని ఐజ్వాల్లో పాటు పలు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిని అధికారులు తొలగిస్తున్నారు. లెంగ్పు విమానాశ్రయానికి వెళ్లే దారిలో మట్టిపెళ్లలు పడటంతో ఆ ప్రాంతాన్ని మూసివేశారు.