5 జాతీయ పార్టీల అడ్రస్ గల్లంతు..ఆప్ గెలుపుతో ప్రాంతీయ పార్టీలు ఖుష్..నోటాకూ నో చెప్పిన ఢిల్లీ ఓటర్
ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ పార్టీలు బలపడుతున్న క్రమంలోనే భారత్ లో బీజేపీ గద్దెనెక్కడం.. గతేడాది లోక్ సభ ఎన్నికల్లో రెండోసారి కూడా బంపర్ మెజార్టీ సాధించిన ఆ పార్టీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడం చూశాం. దేశంలో ఎన్నికల సంఘం చేత 'జాతీయ పార్టీ'లుగా గుర్తింపుపొందినవాటిలో ఒక్క బీజేపీ తప్ప మిగతా ఐదు పార్టీలు కొంతకాలంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇక మంగళవారం వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనైతే ఆ ఐదు జాతీయ పార్టీల అడ్రెస్ గల్లంతైపోయింది. అంతేకాదు నోటాను సంబంధించి కూడా ఆసక్తికరమైన అభిప్రాయం వెల్లడైంది. ఆ విశేషాలేంటంటే..
అందరికీ కలిపి ఆరు శాతం..
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 58 సీట్లలో విజయాన్ని ఖరారు చేసుకోగా, 12 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం అని చెప్పుకోడానికి మిగతా పార్టీలేవి సీట్లు సాధించలేదక్కడ. అసెంబ్లీ ఫైట్ ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యే జరగడంతో మిగతా పార్టీలకు సీట్లు కాదు కదా.. కనీసం ఓట్లు కూడా పడలేదు. పోలైన మొత్తం ఓట్లలో ఆప్ కు 54 శాతం ఓట్లు దక్కగా, బీజేపీ 40 శాతం ఓట్లను రాబట్టుకోగలిగింది. ఐదు జాతీయ పార్టీలు, అరడజనుకుపైగా ఇతర పార్టీలన్నీ కలిసి మిగతా ఆరు శాతం ఓట్లను పంచుకున్నాయి.
జాతీయ పార్టీలు తుస్..
బీజేపీతోపాటు కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం మన దేశంలో జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు కేవలం 4.2 శాతం ఓట్లు దక్కగా బీఎస్పీకి 0.67 శాతం ఓట్లు, సీపీఐ 0.02 శాతం, సీపీఎం 0.01 శాతం, ఎన్సీపీకి 0.37శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. పేరుకు జాతీయ పార్టీలు అయినప్పటికీ దేశ రాజధానిలో ఆ ఐదు పార్టీల అడ్రస్ గల్లంతైంది.
నోటాకు టాటా..
ఉత్కంఠభరితంగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 58 స్థానాలు, బీజేపీకి 12 సీట్లు కట్టబెట్టారు. బీజేపీ తప్ప మిగతా ఐదు జాతీయ పార్టీలకూ జనం చుక్కలు చూపించారు. అదేసమయంలో నన్ ఆఫ్ ది అబౌ(నోటా) ఆప్షన్ కు కూడా ఢిల్లీ ఓటర్లు దాదాపు టాటా చెప్పారు. మొత్తం పోలైన ఓట్లలో అతి స్వల్పంగా కేవలం 0.47 శాతం మంది మాత్రమే నోటా కు ఓటేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు దాదాపు 3 శాతం ఓట్లు పడిన సంగతి తెలిసిందే. ఇక మిగతా పార్టీల విషయానికొస్తే..
నా బీహారీ.. నా యూపీ..
దేశరాజధానిలో నివసిస్తున్నవాళ్లలో ఎక్కువ మంది పంజాబ్, యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందినవాళ్లే కావడంతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు హస్తినలోనూ తమ అదృష్టాన్ని టెస్టు చేసుకుని ఘోరంగా దెబ్బతిన్నాయి. నితీశ్ నాయకత్వంలోని జేడీయూకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 0.8 ఓట్లు రాగా, పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీకి 0.36 శాతం ఓట్లు పడ్డాయి. యూపీ కేంద్రంగా పనిచేస్తోన్న సమాజ్ వాదీ పార్టీ పేరుకు కొన్ని చోట్ల అభ్యర్థుల్ని నిలిపినా.. ఆప్ కు అనుకులంగా వ్యవహరించింది.
ప్రాంతీయ పార్టీలు హ్యాపీ..
బీజేపీని దెబ్బకొట్టడం కాంగ్రెస్ వల్ల కాదని, ఆ పనిని ప్రాంతీయ పార్టీలే చేయగలవని కొంతకాలంగా జరుగుతోన్న ప్రచారం.. జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో నిరూపితమై, ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలతో మరింత బలపడింది. కొద్దోగొప్పో పంజాబ్ లో ప్రభావం చూపినప్పటికీ.. అర్భర్ రాష్ట్రమైన ఢిల్లీలోనే ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా కొనసాగుతోంది. కేజ్రీవాల్ గెలుపును సహచర ప్రాంతీయ పార్టీలన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, తమిళనాడులో డీఎంకే, ఒడిశాలో బీజేడీ, జార్ఖండ్ లో జేఎంఎం తదితర పార్టీలు కేజ్రీవాల్ కు శుభాభినందనలు తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.