వార్నీ... ఎంత మోసం! ఐటీ రిటర్నులలో ఆధార్ నిబంధన ఇందుకేనా?
ఇన్నాళ్లూ గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలా? వద్దా అనే విషయాన్ని దేశ ప్రజల ఇచ్చకు వదిలేసిన కేంద్రం ఇప్పుడు వినియోగదారుల తాట తీయడానికి నేరుగా రంగంలో దిగనుంది.
న్యూఢిల్లీ: ఐటీ రిటర్నులలో ఆధార్ నంబర్ కచ్చితంగా పేర్కొనాలన్న నిబంధన ఎందుకో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధన పరమావధి ఏమిటబ్బా.. అని ఆలోచనలో పడిన వారికి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం కలుగుతోంది.
దీని వెనుక ఉన్న రహస్యం.. గ్యాస్ సబ్సిడీ అని తెలియగానే 'వార్నీ.. ఇదా సంగతి' అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలా? వద్దా అనే విషయాన్ని దేశ ప్రజల ఇచ్చకు వదిలేసిన కేంద్రం ఇప్పుడు వినియోగదారుల తాట తీయడానికి నేరుగా రంగంలో దిగనుంది.
మీ సంవత్సర ఆదాయం రూ.10 లక్షలు దాటితే మీరు గ్యాస్ సబ్సిడీ వదులుకోవలసిందే. ఇకమీదట ఇది మీ విచక్షణకు వదిలేయకుండా ప్రభుత్వమే మీ గ్యాస్ సబ్సిడీని లాగేసుకోవడానికి పథకం వేసింది. దీంట్లో భాగమే ఆధార్ నిబంధన.
ప్రభుత్వం సూచన ప్రకారం, గ్యాస్ కంపెనీల అభ్యర్థన ప్రకారం దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగదారులు మూడేళ్లుగా తమ ఆధార్ నెంబర్ను అటు బ్యాంకు ఖాతాలతో అనుసంధానమేకాక ఇటు వంట గ్యాస్ మార్కెటింగ్ సంస్థల వద్ద నమోదు చేసుకుంటూ వస్తున్నారు.
ఇన్నాళ్లూ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తూ వస్తోంది. అయితే ఉద్యోగులు, వ్యాపారుల వార్షిక రాబడి వివరాలను ట్రాక్ చేసే వెసులుబాటు లేని కారణంగా, రూ.10 లక్షల వార్షికాదాయం దాటిన వారికి గ్యాస్ సబ్సిడీని తొలగించాలన్న ప్రభుత్వ ఆలోచన పెద్దగా కార్యరూపం దాల్చడం లేదు.
ఇప్పుడు ఐటి రిటర్నులలో విధిగా ఆధార్ సంఖ్య తెలియజేయాలన్న నిబంధన వల్ల ప్రభుత్వం పని మరింత సులభం అవుతుంది. నిర్దేశిత వార్షికాదాయ పరిమితిని దాటిన వారిలో ఎందరు వంట గ్యాస్ సబ్సిడీని వినియోగించుకుంటున్నారో ఆధార్ నంబర్ను బట్టి ప్రభుత్వం ఇట్టే ట్రాక్ చేయగలుగుతుంది.
దీనిని బట్టి వంటగ్యాస్ సబ్సిడీలపై వేటుకు అవకాశం ఉంటుంది. వంట గ్యాస్ సబ్సిడీలను స్వచ్ఛందంగా వదులుకోవాల్సిందిగా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే వంట గ్యాస్ సబ్సిడీని వదులుకోవడంతో ఇలా కాదని కేంద్రం ఇప్పుడు ఆధార్ కొరడా ఝళిపించడానికి సిద్ధమవుతోంది.
అంతేకాదు, ఐటి రిటర్నులలో ఉండే ఆధార్ నంబర్ సహాయంతో ఇప్పటి వరకూ రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకుంటున్న వారికి కూడా ప్రభుత్వం త్వరలో చెక్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.