పెద్ద నగదు నోట్ల ఎఫెక్ట్, నకిలీ ఖాతాలతో నగదు మార్పిడి, వందల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన నగదుపై ఆదాయపు పన్నుశాఖాధికారులు దృష్టి కేంద్రీకరించారు. డిల్లిలోని యాక్సిస్ బ్యాంకులో 44 నకిలీ ఖాతాలను గుర్తించారు.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దుతో నల్ల ధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు అక్రమార్కులు అనేక వక్రమార్గాల్లో పయనించారు. బ్యాంకు అధికారుల సహయంతో తమ వద్ద ఉన్న నగదును పెద్ద మొత్తంలో మార్చుకొనే ప్రయత్నాలను చేశారు. నకిలీ ఖాతాలను సృష్టించి డబ్బులను మార్పిడి చేసుకొనేందుకు ప్రయత్నించారు.ఆదాయపు పన్ను శాఖాధికారులు ఈ మేరకు 44 నకిలీ ఖాతాలను గుర్తించారు.
న్యూఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకులో సుమారు వంద కోట్ల అక్రమ ధనాన్ని ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు. ఢిల్లీలోని చాందినిచౌక్ లోని యాక్సిస్ బ్యాంకులో సుమారు 44 నకిలీ ఖాతాలను ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు. ఈ ఖాతాలకు సంబందించిన సరైన ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.
యాక్సిస్ బ్యాంకుల్లో కొత్తగా ప్రారంభించిన ఖాతాల్లో సుమారు 450 కోట్లను డిపాజిట్ చేశారని ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు. పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత ఏ బ్యాంకులో ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ అయ్యాయనే సమచారం ఆదారంగా ఆదాయపు పన్నుశాఖాధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. అయితే యాక్సిస్ బ్యాంకులో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
తమ నిబంధనలకు విరుద్దంగా అక్రమార్కులకు ఎవరైనా బ్యాంకు అధికారులు సహకరించినట్టుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.మరో వైపు కొన్ని అక్రమాలు చోటుచేసుకొన్న అంశంపై కశ్మీరీ గేట్ బ్రాంచ్ పై కూడ అనుమానాలు వచ్చాయి. ఈడీ అధికారులు ఇద్దరు యాక్సిస్ బ్యాంకు అధికారులను అరెస్టు చేశారు. అక్రమాల్లో బ్యాంకు అధికారులు సహకారం ఉందనే ఆరోపణలపై వారిని అరెస్టు చేశారు.గతంలోనే ఇతరుల డబ్బులను తమ ఖాతాల్లో జమ చేసుకోకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలకు విన్నవించారు. ఒకవేళ ఈ రకంగా పెద్దమొత్తంలో నగదును తమ ఖాతాల్లో జమ చేసుకొంటే వారు ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో ఆధారాలు చూపాల్సిందే.