శశికళ నటరాజన్ దిమ్మతిరిగింది: రూ. 380 కోట్ల బినామీ ఎస్టేట్ సీజ్, చివరిగా చిన్నమ్మ!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణస్నేహితురాలి ముసుగులో చిన్నమ్మ శశికళ వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం వక్తం చేస్తున్నారు. తాజాగా శశికళ నటరాజన్ బినామీ ఆస్తులపై నిఘా వేసిన ఐటీ శాఖ అధికారులు రూ. 380 కోట్లకు పైగా విలువైన ఎస్టేట్ సీజ్ చేశారని తెలిసింది. శశికళ బినామీ కంపెనీ పేరుతో రూ. 380 కోట్లకు పైగా విలువైన ఎస్టేట్ సీజ్ చేసిన అధికారులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారని తెలిసింది.
బినామీ ఆస్లులు
గత సంవత్సరం నవంబర్ నెలలో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను లక్షంగా చేసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు చెన్నై, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో 187 చోట్ల దాడులు చేసి అక్రమాస్తుల వివరాలు సేకరించారు.
రూ. 4 వేల కోట్ల ఆస్తులు
శశికళకు కుటుంబ సభ్యులకు చెందిన ఆదాయానికి మించిన రూ. 4 వేల కోట్లకుపైగా అక్రమాస్తులు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు వాటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఆస్తులు శశికళ కుటుంబ సభ్యులకు ఎలా వచ్చాయి ? అంటూ ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
చెన్నైలో బినామీ కంపెనీ
చెన్నై నగరంలోని ఎంఆర్ సీ నగర్ లో ఆది ఎంటర్ ప్రైజస్ అనే పేరుతో ఉన్న శశికళ బినామీ కంపెనీని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఆది ఎంటర్ ప్రైజస్ పేరుతో చెన్నై శివార్లలో రూ. 380 కోట్లకు పైగా విలువ చేసే 4.3 ఎకరాల ఎస్టేట్ ఉందని అధికారులు గుర్తించారు.
రూ. 380 కోట్ల ఎస్టేట్ సీజ్ !
శశికళ బినామీ కంపెనీగా భావిస్తున్న ఆది ఎంటర్ ప్రేజస్ కు చెందిన ఎస్టేట్ విషయంలో విచారణ చేసిన అధికారులు సరైన సమాధానం రాకపోవడంతో దానిని సీజ్ చేశారని తెలిసింది. ఆది ఎంటర్ ప్రేజస్ నిర్వహకులను ఐటీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.
శశికళ సమాధానం
శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల వివరాలు పూర్తిగా సేకరించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే వేర్వేరుగా వారికి సమన్లు జారీ చేసి విచారణ చేసి వివరాలు రాబట్టారు. ఇక చివరిగా శశికళను విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారు.