56వారాల్లో ట్యాక్స్ పేయర్స్కు రికార్డు స్థాయిలో డబ్బులు రీఫండ్ చేసిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: కరోనావేళ ట్యాక్స్ రీఫండ్లను అత్యంత వేగంగా అంటే నిమిషానికి 76 కేసులను పరిష్కరించింది ఆదాయపుపన్ను శాఖ. ఈ ఏడాది 8 ఏప్రిల్ నుంచి30 జూన్ వరకు నిమిషానికి 76 కేసుల చొప్పున పన్నుచెల్లింపుదారులకు పన్ను చెల్లించింది ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్. మొత్తం రూ.62,361 కోట్లు 20.44 లక్షల కేసులకు రీఫండ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ పేర్కొంది.
కోవిడ్-19 కష్ట కాలంలో అత్యంత వేగంగా ట్యాక్స్ రీఫండ్స్ చేసినట్లు ఐటీశాఖ తెలిపింది. కష్టసమయంలో రీఫండ్ చెల్లించి మరోసారి ఐటీశాఖ పన్ను చెల్లింపుదారులకు యూజర్ ఫ్రెండ్లీగా మారిందని వెల్లడించింది. ఇక మొత్తం చెల్లింపుల్లో రూ.23,453.57 కోట్లు 19,07,853 కేసులకు వర్తించగా రూ.38,908.37 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ రీఫండ్ కింద చెల్లించడం జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇక ఈ చెల్లింపులు మొత్తం డిజిటల్ పద్ధతిలోనే జరిగాయని స్పష్టం చేసింది. ట్యాక్స్ పేయర్స్ ఖాతాలోకి నేరుగా డబ్బులను బదిలీ చేయడం జరిగిందని ఆర్థికశాఖ ప్రకటనలో పేర్కొంది.
గతంలో ట్యాక్స్ పేయర్ ఆఫీసులకు వెళ్లి రీఫండ్స్ పై వాకాబు చేయాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు మాత్రం అలా లేదని ఆర్థికశాఖ తెలిపింది. డబ్బులు విడుదల చేయాల్సిందిగా అడగాల్సిన పనిలేదని నేరుగా తమ ఖాతాలోకి బదిలీ చేయడం జరుగుతుందని ఆర్థికశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఆదాయపు పన్నుశాఖ నుంచి వచ్చే ఈ-మెయిల్స్కు వెంటనే స్పందించాల్సి ఉంటుందని అలా చేస్తే డబ్బులు ఖాతాలోకి బదిలీ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తామని సీబీడీటీ వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ఐటీ శాఖ నుంచి వచ్చే ఈ-మెయిల్లోని అంశాలు అంటే ఔట్స్టాండింగ్ డిమాండ్, బ్యాంకు అకౌంట్ నెంబర్లు స్పష్టంగా తెలపాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయితే వెంటనే డబ్బులు పన్నుచెల్లింపుదారుడి ఖాతాకు బదిలీ చేసే ప్రక్రియ పూర్తవుతుందని సీబీడీటీ వివరించింది.