నేమ్ అండ్ షేమ్: ఐటీ చెల్లించకుంటే ఇవన్నీ కట్! షాకే
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ పరిధిలో ఉండి, పన్ను చెల్లించకుండా తప్పించుకునే వారికి షాక్. ఇందుకు సంబంధించి ఆదాయపన్ను శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. వీరికి ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందే అన్ని సౌకర్యాలు నిలిపివేయాలని నిర్ణయించింది.
ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై కొరడా ఝులిపించనుంది. పన్ను ఎగ్గొట్టే వారి పాన్ను నిలిపివేస్తారు. గ్యాస్ సబ్సిడీలను రద్దు చేస్తారు. అంతేకాదు, రుణాలు మంజూరు కాకుండా చర్యలు తీసుకోనున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా రద్దు కానుంది.
ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిలుపుదల, కొత్త ఆస్తుల కొనుగోలు చేసిన వారి రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని ట్యాక్స్ కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది.
సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్)లోని సమాచారాన్ని అంతటినీ సమీకరించి, వాటి ఆధారంగా డిఫాల్టర్లను గుర్తించి వారి పేర్లను జాతీయ దినపత్రికల్లో ప్రచురించి పరువు తీయాలని, ఇదే సమాచారాన్ని 'నేమ్ అండ్ షేమ్' జాబితాలో ఉంచాలని కూడా నిర్ణయించింది. ఈ తరహా చర్యలతో వారందరినీ పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి చేర్చవచ్చన్నది ఐటీ విభాగం అధికారుల ఆలోచన.