అడ్డదారుల్లో 20 వేల కోట్లు..! తుట్టె కదిలిస్తున్న ఐటీ శాఖ
ఢిల్లీ : కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. సరిగ్గా ఐటీ శాఖ అధికారులు అదే వంటబట్టించుకున్నారు. ఢిల్లీలో 20 వేల కోట్ల రూపాయలకు పైగా హవాలా, మనీలాండరింగ్ తుట్టెను కదిలించారు. ఆర్థిక నేరగాళ్ల కార్యకలాపాలను గుట్టురట్టు చేశారు.
తుట్టె కదిలింది.. గుట్టు రట్టైంది
దేశ రాజధాని ఢిల్లీలో హవాలా, మనీలాండరింగ్ రాకెట్ బ్లాస్టయింది. ఐటీ అధికారుల దాడుల్లో అక్రమ ఆర్థిక కార్యకలాపాల దొంగల గుట్టు రట్టైంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 వేల కోట్ల రూపాయల హవాలా, మనీ లాండరింగ్ రాకెట్ బయటపడింది. కొద్ది వారాలుగా ఐటీ శాఖ అధికారులు వరుసగా చేస్తున్న దాడులతో ఈ విషయం వెలుగుచూసింది. మూడు గ్రూపులకు చెందిన వ్యక్తులు అక్రమ ఆర్థిక కార్యాకలపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నయా బజార్ ప్రాంతంలో ఒక గ్రూప్ కింద 12 బోగస్ సంస్థలు స్థాపించి.. దాదాపు 18 వేల కోట్ల రూపాయల అక్రమ బిల్లులు రూపొందించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.
ఆర్బీఐ పాలసీ: 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపోరేట్... తగ్గనున్న గృహరుణాలపై వడ్డీ రేట్లు
అడ్డదారులు.. కోట్ల రూపాయలు
మరో కేసులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు భావిస్తున్నారు ఐటీ అధికారులు. టెక్నాలజీని వాడుకుంటూ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ఆ ముఠా గుట్టురట్టు చేశారు. మనీలాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. అక్రమ మార్గాల్లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పొందినట్లు చెబుతున్నారు. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందనేది పైకి కనిపిస్తున్న లెక్కలు అయినప్పటికీ.. ఈ అక్రమ వ్యవహారం ఏళ్లకొద్దీ కొనసాగుతున్నట్లు పేర్కొంటున్నారు. పెద్దమొత్తంలోనే అక్రమ వ్యవహారం నడిచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ మేరకు తీగ లాగుతున్నారు. డొంక కదిలితే గానీ ఎంతమేర అక్రమాలు జరిగాయనేది తెలియదు.
ఐటీ కొరడా.. 20 వేల కోట్ల తుట్టె
మరో గ్రూప్ కు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విదేశీ బ్యాంకు ఖాతాల ద్వారా ఎక్స్పోర్ట్స్ ఇన్వాయిస్ లతో జీఎస్టీ, సుంకాలు అక్రమ మార్గాల్లో క్లెయిమ్ చేసుకుంటున్న ముఠా వ్యవహారం వెలుగులోకి తెచ్చారు. ఈ గ్రూప్ నిర్వహించిన ఆర్థిక నేర కార్యకలాపాల విలువ 1500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. హవాలా, మనీ ల్యాండరింగ్ నేరగాళ్లపై కొరడా ఝలిపించిన ఐటీ అధికారులు.. వంద కోట్ల రూపాయలకు సంబంధించి విలువైన పత్రాలు జప్తు చేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో మూడు గ్రూపులకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు.. దాదాపు 20 వేల కోట్ల రూపాయల దాకా పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. బోగస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో పాటు బోగస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా నిందితులు మోసాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. వీటి వెనుక ఎవరున్నారనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.