యూపీఐ లావాదేవీలు జరిపినవారికి ఛార్జీలు తిరిగి చెల్లించండి: బ్యాంకులకు ఐటీ శాఖ
న్యూఢిల్లీ: ఆదాయపుపన్ను శాఖ ద్వారా వినియోగదారులకు ఒక తీపికబురు అందింది. రూపే కార్డులు, భీమ్-యూపీఐ ఉపయోగించి చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను తిరిగి వినియోగదారులకే చెల్లించాలని ఆదాయపుపన్ను శాఖ బ్యాంకులకు సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలను తక్షణమే చెల్లించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదివారం ఒక సర్కూలర్ జారీ చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 269 ఎన్యూను అనుసరించి ఈ డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదని తేల్చిచెప్పింది. కాగా, డిజిటల్ లావాదేవీల పెంపు, నగదు రహిత ఆర్తిక వ్యవస్థను రూపొందించేందుకు గాను ఫైనాన్స్ యాక్ట్, 2019లో కేంద్రం ఈ సెక్షన్ ను చేర్చింది.
రూపే డెబిట్ కార్డు, భీమ్-యూపీఐ, క్యూఆర్ కోడ్లను నిర్దేశిత ఎలక్ట్రానిక్ వ్యవస్థల కింద నోటిఫై చేసింది. కాబట్టి డిజిటల్ రూపంలో పేమెంట్స్ చేసిన వారికి వెంటనే వసూలు చేసిన ఛార్జీలను చెల్లించాలని సీబీడీటీ బ్యాంకులకు స్పష్టం చేసింది
Recommended Video
అంతేగాక, వీటికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించబోదని తేల్చిచెప్పింది. నిర్దేశించిన లావాదేవీలు దాటిన తర్వాత యూపీఐ పేమెంట్స్పై కొన్ని బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సీబీడీటీ దృష్టికి రావడంతో ఈ సర్కూలర్ జారీ చేసింది. ఆదాయపుపన్ను శాఖ తాజా ఆదేశాలతో యూపీఐ లావాదేవీలు జరిపిన వినియోగదారులకు కొంత మేలు జరుగనుంది.