ఐఏఎస్ ఇంట్లో రూ.10 కోట్లు.. 10 కేజీల గోల్డ్!
నోయిడాలో ఓ ఐఏఎస్ అధికారికి చెందిన ఇళ్లపై అదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి రూ.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ: పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఐఏఎస్ అధికారికి చెందిన ఇళ్లపై అదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి.. భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
నోయిడాలోని ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేశవ్ లాల్ ఇళ్లపై గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. ఈయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
కేశవ్ లాల్ కాన్పూర్ పరిధిలో అమ్మకం పన్ను విభాగంలో అదనపు కమిషనర్ గా పని చేస్తున్నారు. గతంలో నోయిడా ప్రాధికార సంస్థ ఓఎస్డీగా కూడా పని చేశారు. గురువారం ఈయనకు చెందిన ఇళ్లపై దాడులు చేసిన అదాయపన్ను శాఖ అధికారులు రూ.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం, కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారుల ఇళ్లల్లో అదాయపన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మరికొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.