ఐటీ రిటర్న్స్లో తప్పులు చూపిస్తున్నారా?: ఆదాయపన్ను శాఖ హెచ్చరిక!
న్యూఢిల్లీ: అక్రమ పద్ధతుల్లో అధిక ఖర్చు చూపించే వేతన జీవులకు ఆదాయపన్ను శాఖ బుధవారం నాడు హెచ్చరికలు జారీ చేసింది. పన్ను మినహాయింపు పొందేందుకు చాలామంది అధిక ఖర్చులు చూపిస్తుంటారు. అలాంటి వారికి ఐటీ శాఖ ఈ హెచ్చరిక.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు లెక్కలు చూపిస్తూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. దీంతో పాటు వారు పని చేస్తున్న సంస్థల యజమానులే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారని పేర్కొంది.
ఐటీ శాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ ప్రొసెసింగ్ సెంటర్ (సీపీసీ) ఐటీ రిటర్న్స్ను ప్రాసిస్ చేస్తుంది. అయితే, ట్యాక్స్ కట్టే ఉద్యోగులు ప్రయోజనాలు పొందేందుకు, తప్పుడు మార్గాల్లో క్లెయిమ్లు చేస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని గుర్తించింది. ఇలాంటి వ్యవహారాల వెనుక వెనుక కొందరు వ్యక్తులు మధ్యవర్తులుగా ఉంటున్నట్టు గుర్తించామని తెలిపింది.
కొందరు ఆదాయ పన్ను సలహాదారులుగా చెప్పుకొంటున్న వాళ్లు తప్పుడు మార్గాల్లో క్లెయిమ్స్ చేసుకోవచ్చని సూచిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి చర్యలు ఆదాయపన్ను శాఖ చట్టం ప్రకారం నేరమని, శిక్షార్హమని చెప్పింది.
ఈ ఏడాది జనవరి మాసంలో బెంగళూరులోని కొన్ని ఐటీ సంస్థలకు చెందిన ఉద్యోగులు మధ్యవర్తుల సలహాలతో ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని తమ విచారణ విభాగం దర్యాప్తులో తేలిందని పేర్కొంది.