కర్ణాటకలో ఐటీ శాఖ, ఈసీ దాడులు, టార్గెట్ కాంగ్రెస్, బళ్లారి శ్రీరాములు పోటీ, 2 కోట్లు నగదు సీజ్!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆదాయపన్ను శాఖ (ఐటీ) శాఖ అధికారులు, ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు దాడులు ముమ్మరం చేశారు. కోస్తా కర్ణాటకలోని కారవారలో శుక్రవారం ఆదాయపన్ను శాఖ, ఎన్నికల సంఘం అధికారులు దాడులు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు
కారవార శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతీష్ సైల్, ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన మంగళ్ దాస్ కామత్ కు చెందిన అంకోళ తాలుకాలోని అవర్సాలోని ఇల్లు, కార్యాలయాల్లో శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇల్లు
శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సతీష్ సైల్ కు చెందిన సదాశివగడలోని ఇంటిని ఆదాయపన్ను శాఖ అధికారులు పరిశీలించారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సతీష్ సైల్ భారీ మొత్తంలో ఓటర్లకు నగదు పంచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
భారీ మొత్తంలో నగదు
కారవార శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతీష్ సైల్ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన సన్నిహితులతో భారీ మొత్తంలో నగదు పంచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు ఆదాయపన్ను శాఖ, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిసింది.
ఐటీ, ఈసీ దాడులు
మే 12వ తేదీ కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. 224 శాసన సభ నియోజక వర్గాల్లోని పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
శ్రీరాములు పోటీ, రూ. 2 కోట్లు సీజ్
చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు నియోజక వర్గంలో బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు పోటీ చేస్తున్నారు. మాళకాల్మూరు తాలుకా ఎద్దలబోమ్మనహట్టిలో స్కార్పియో వాహనంలో తరలిస్తున్న రూ. 2 కోట్ల రూపాయలను ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు. ఈ నియోజక వర్గం నుంచి బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు పోటీ చేస్తున్నారు. గంగావతి శాసన సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి సోదరుడికి చెందిన హోటల్ లో ఎన్నికల సంఘం అధికారులు సోదాలు చేశారు.