కర్ణాటక మంత్రికి షాక్ ఇచ్చిన ఐటీ శాఖ, ఇద్దరు అదుపులోకి, భారీ మొత్తంలో నగదు, టార్గెట్ కాంగ్రెస్!
మంగళూరు: కర్ణాటక మంత్రికి అత్యంత సన్నిహితుల మీద ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు పంజా విసిరారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఆదాయపన్ను శాఖ అధికారులు నిఘా వేసి అర్దరాత్రి సమయంలో దాడులు చేస్తున్నారు.
మంత్రి రామనాథ్ రై
దక్షిణ కన్నడ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా రామనాథ్ రై ఉన్నారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాళ శాసన సభ నియోజక వర్గం నుంచి మంత్రి రామనాథ్ రై పోటీ చేస్తున్నారు. మంత్రి రామనాథ్ రై తన సన్నిహితులతో బంట్వాళ శాసన సభ నియోజక వర్గం ప్రజలకు భారీ మొత్తంలో నగదు పంచి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఐటీ శాఖకు సమాచారం
దక్షిణ కన్నడ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి రామనాథ్ రైకి డెన్జిల్ డిసౌజ అనే వ్యక్తి అత్యంత సన్నిహితుడు. డెన్జిల్ డిసౌజ, మంత్రి రామనాథ్ రైకి చెందిన మరో సన్నిహితుడు అక్రమంగా నగదు నిల్వ చేసుకుని ఓటర్లకు పంచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అర్దరాత్రి ఐటీ దాడులు
బుధవారం అర్దరాత్రి ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళూరు, బంట్వాళలో మంత్రి రామనాథ్ రై సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. ఇంటిలోని పత్రాలు పరిశీలించారు. ఆ సమయంలో భారీ మొత్తంలో నగదు బయటపడిందని తెలిసింది.
అధికారుల అదుపులోకి ఇద్దరు
మంత్రి రామనాథ్ రైకి అత్యంత సన్నిహితుడైన డిన్జిల్ డిసౌజ, మరో వ్యక్తి ఇంటిలో భారీ మొత్తంలో నగదు వెలుగు చూడటంతో ఇద్దరినీ ఆదాయపన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ మంగళూరులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు.
సీఎం సిద్దూ బంధువు
ఇటీవల సీఎం సిద్దరామయ్య సమీప బంధవుకు చెందిన చామరాజనగరలోని ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. విజయనగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనంద్ సింగ్ కు చెందిన బాదామి సమీపంలోని రిసార్టులో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు.
బళ్లారి శ్రీరాములు టార్గెట్
బుధవారం బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు సన్నిహితుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. శాసన సభ ఎన్నికల సందర్బంగా ఓటర్లకు భారీ మొత్తంలో నగదు పంచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు వివిద నియోజ వర్గాల మీద నిఘా వేశారు.