బినామీ ఆస్తుల కేసు: రాబర్ట్ వాద్రా ఇంటికి ఐటీశాఖ అధికారులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇంటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెళ్లారు. బినామీ ఆస్తుల కేసులో వాంగ్మూలం సేకరించేందుకు తూర్పు ఢిల్లీలోని సుఖ్దేవ్ విహార్లో ఉన్న వాద్రా కార్యాలయాన్ని సందర్శించారు.
రెండు బినామీ ఆస్తుల కేసులకు సంబంధించి గతంలో ఐటీ శాఖ సమన్లు జారీ చేయగా.. కరోనాను కారణంగా చూపి రాబర్ట్ వాద్రా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులే వాంగ్మూలం తీసుకునేందుకు ఆయన నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, రాబర్ట్ వాద్రాపై దేశ, విదేశాల్లో పలు కేసులున్నాయి. లండన్లోని 12 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తులు కొనుగోలు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ద్వారా ఆయన ఈ ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై 2018న ఈడీ కేసు నమోదు చేసింది.
సుమారు రూ. 100 కోట్ల అక్రమాస్తులున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే, 2015లో రాజస్థాన్లోని బికనీర్లో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ తక్కువ ధరకు 69.55 హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి అధిక ధరకు అమ్మినట్లు ఆరోపణలున్నాయి.
అంతేగాక, గురుగ్రాంలో కూడా 2.5 ఎకరాల భూమిని డీఎల్ఎఫ్కు అధిక ధరకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో 2018లో రాబర్ట్ వాద్రాతోపాటు అప్పటి హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడపైనా కేసు నమోదైంది.