జయలలిత మేనకోడలు దీపా ఇంటి దగ్గర హైడ్రామా: ఐటీ శాఖ, సోదాలు, లాయర్, పోలీస్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా ఇంటి దగ్గర శనివారం హై డ్రామా చోటు చేసుకుంది. తాను ఆదాయపన్ను శాఖ అధికారి, మీ ఇంటిలో సోదాలు చెయ్యాలని ఓ వ్యక్తి హంగామా చేశాడు. దీపా భర్త, ఆమె న్యాయవాది ఐటీ శాఖ అధికారికి పలు ప్రశ్నలు వేశారు. చివరికి థ్రిల్లర్ సినిమాను తలపించే సన్నివేశాలు అక్కడ చోటు చేసుకున్నాయి. పోలీసులు ప్రత్యక్షం అయ్యారు.
ఐటీ శాఖ అధికారి
శనివారం ఓ వ్యక్తి జయలలిత మేనకోడలు దీపాకు చెందిన టీనగర్ లోని శివగాననమ్ వీధిలోని ఇంటి దగ్గరకు వెళ్లాడు. తన పేరు మిథేష్ కుమార్, నేను ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారి, సాటి ఉద్యోగులు వస్తున్నారని చెప్పి పరిచయం చేసుకున్నాడు.
దీపా భర్త మాధవన్
ఆ సమయంలో ఇంటిలో ఉన్న దీపా భర్త మాధవన్ మీరు ఐటీ శాఖ అధికారి అయితే ఒక్కరే వచ్చారు, మిగిలన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మార్గం మధ్యలో వారు వస్తున్నారని, మీ ఇంటిలో సోదాలు చెయ్యాలని పట్టుబట్టాడు. అయితే దీపా భర్త మాధవన్ మాత్రం సోదాలు చెయ్యడానికి అంగీకరించలేదు.
లాయర్ ఎంట్రీ
దీపా న్యాయవాది సమి చిన్నపిళ్లై అక్కడికి చేరుకుని ఐటీ శాఖ అధికారి అంటున్న మిథిషే కుమార్ అనే వ్యక్తికి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదాయపున్ను శాఖ దాడులు అంటే కనీసం ఐదు మందికి పైగా వస్తారని, ఇలా ఒక్కరే రారని, పోలీసులను వెంటపెట్టుకుని వస్తారు కదా అని ప్రశ్నించారు.
పోలీసులకు ఫోన్
దీపా భర్త మాధవన్, న్యాయవాది సమి చిన్నపిళ్లైకి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడుతున్నట్లు నటించిన మిథేష్ కుమార్ చిన్నగా గేటు బయటకు వచ్చి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు.
నకిలీ ఐటీ శాఖ ఆఫీసర్
మిథేష్ కుమార్ అనే వ్యక్తి నకిలీ ఐటీ శాఖ అధికారి అని వెలుగు చూడటంతో దీపా భర్త మాధవన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారిని దీపా ఇంటి దగ్గరకు ఎవరు పంపించి ఉంటారు అని ఆమె మద్దతుదారులు చర్చించుకుంటున్నారు. పోలీసులు దీపా ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు
జయలలిత మరణించిన తరువాత ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై స్థాపించిన దీపా తన మేనత్త ఆస్తుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన మేనత్త జయలలిత ఆస్తులు తనకు దక్కకుండా చేస్తున్నారని దీపా ఆరోపించారు.
శశికళ, దినకరన్
శశికళ, టీటీవీ దినకరన్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని దీపా ఇటీవల చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీలో పదవులు ఇస్తామని దీపా అనేక మంది దగ్గర నగదు వసూలు చేస్తున్నారని ఆమె మీద పలువురు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమయంలో దీపా ఇంటి దగ్గర నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారి ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించి మరో చర్చకు దారితీసింది.