ఆదాయపన్ను చెల్లించేవారికి శుభవార్త: 15 రోజుల్లో రీఫండ్?
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లించేవారికి శుభవార్త. ఇటీవల ఐటీ రిటర్నులు దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మరీ మంచి విషయం. ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) ఆదాయపన్ను శాఖను అడిగిందట.
దరఖాస్తుదారులకు ఆదాయపన్ను రిటర్న్స్ను కేవలం పదిహేను రోజుల్లో తిరిగివ్వాలని ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతా బాగుంటే ఆదాయపన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఇస్తే, దరఖాస్తు పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పదిహేను రోజుల్లో రీఫండ్ ఇచ్చే విధానం త్వరలో రావొచ్చు.
ఐటీ రిటర్న్స్ ఈ-వెరిఫికేషన్ పూర్తి కాకుంటే రిటర్న్స్ ఆలస్యమయ్యే అవకాశముంటుంది. అయితే ప్రస్తుతం ఐటీ రిటర్న్స్కు ఇంత సమయంలో కచ్చితంగా రీఫండ్ చేయాలనేది ఏమీలేదు. పదిహేను రోజుల నుంచి రెండు మూడు నెలలు కూడా పడుతుంది.