ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడిగింపు: ఆధార్-ప్యాన్ లింక్ కూడా
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి కేంద్రం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. పన్ను రిటర్న్ దాఖలుకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలుకు జులై 31 వరకు గడువు పొడిగించింది.
2019-20 ఐటీ రిటర్న్ దాఖలుకు నవంబర్ 30 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కూడా గడువును వచ్చే మార్చి వరకు పెంచింది. దీంతో అనుసంధానం చేయని వారికి మరో అవకాశం ఇచ్చినట్లయింది.
ఆధార్ కార్డును ప్యాన్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా ప్యాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని స్పష్టం చేసింది. ఇన్కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా వీలుకాదని హెచ్చరించింది. అంతేకాదు ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయకపోతే ఆర్ధిక లావాదేవీలు జరపలేరని కూడా తేల్చి చెప్పింది.