భారత్లో బలపడుతోన్న కరోనా: మరింత ధాటిగా: ఒకేరోజు 540 పాజిటివ్ కేసులు: ఇదివరకెప్పుడూ లేనంతగా..
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా వైరస్ మరింత బలపడుతోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత కూడా.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదువుతోండటం వల్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించడాన్ని నియంత్రించడం ద్వారానే కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ..ఆశించిన స్థాయిలో ఫలితాలు రావట్లేదు.
మనదేశంలో ఒకేరోజు 540 పాజిటివ్ కేసులు నమోదు కావడమే దీనికి ప్రధాన కారణం. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభించిన తరువాత.. ఒకేరోజు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడ ఇదే తొలిసారి. దీనితో మొత్తం కరోనా పాజిటివ కేసుల సంఖ్య 5734కు చేరుకుంది. అలాగే- వేర్వేరు రాష్ట్రాల్లో 17 మంది మరణించారు. ఇప్పటిదాకా 166 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లల్లో కొత్తగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతమౌతోన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ను పొడిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లాక్డౌన్ పొడిగించడానికి అవకాశాలు ఉన్నాయంటూ అన్ని పార్టీల సభా పక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మోడీ ఓ సంకేతాలను కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని లాంఛనప్రాయంగా వెల్లడించడం ఒక్కటే మిగిలి ఉందని తెలుస్తోంది.
ఈ సారి లాక్డౌన్ పరిస్థితులను మరింత కట్టుదిట్టంగా అమలు చేయబోతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. నిత్యావసర సరుకులు, వైద్య అవసరాల కోసం రోడ్ల మీదికి వస్తోన్న వారిని నియంత్రించడానికి పెద్ద ఎత్తున చర్యలను చేపట్టబోతున్నాయి. కిరాణా దుకాణాల సమయాన్ని కుదించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితోపాటు- మాస్క్ లేకుండా లేదా ముఖాన్ని కప్పుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిని అరెస్టు చేయడానికీ వెనుకాడని విధంగా కట్టుదిట్ట చర్యలను చేపట్టవచ్చని తెలుస్తోంది. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
Recommended Video