ఐటీ రంగంలో పెరుగుతున్న జీతాలే ఇంజనీర్ల పతనానికి కారణమా?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనాలు దాదాపు 40శాతం పెరిగాయి.ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీల్లో బాగా డిమాండ్ ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లోని ఉద్యోగస్తులకు ఈ పెరుగుదల ఎక్కువగా కనిపించింది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న పెద్ద కంపెనీల్లో ఉద్యోగులు దాదాపు 40శాతం నుంచి 45 శాతం పనిని పై టెక్నాలజీ వినియోగించి పూర్తి చేస్తున్నారు. ఇక ఈ రంగాల్లో 2 నుంచి ఏడేళ్లు అనుభవం ఉన్నవారి కోసం పలు ప్రముఖ కంపెనీలు ఎంత వేతనం ఇచ్చి అయినా సరే నియమించుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పైన మూడు రంగాల్లో ఆరితేరిన వారికోసం కంపెనీలు వేట కొనసాగిస్తున్నాయని బెంగళూరుకు చెందిన ఓ హెచ్ఆర్ మేనేజర్ చెప్పారు.
క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ టెక్నాలజీపై పట్టుండాలి
డిజిటల్ టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అలాంటి స్కిల్ ఉన్నవారి కోసం కంపెనీలు వేటకొనసాగిస్తున్నాయని హెచ్ఆర్ మేనేజర్ తెలిపారు. అంతేకాదు ఇది మంచి జీతంతో కూడిన ఉద్యోగం తెచ్చుకునేందుకు మంచి సమయం అని అన్నారు. ఒక కంపెనీలో పని చేస్తూ దాదాపు ఏడేళ్లు అనుభవం ఉండి మరో కంపెనీకి వెళితే ఆ ఉద్యోగికి 35శాతం నుంచి 40 శాతం పెరుగుదలతో వేతనం ఆఫర్ చేస్తున్నారని వెల్లడించారు.
టాప్ -100లో లేని ఇంజనీరింగ్ కాలేజీలే టార్గెట్
ఏప్రిల్ జూన్ క్వార్టర్లో ఒక్క టీసీఎస్ మినహాయిస్తే అన్ని ఐటీ కంపెనీలు దాదాపు 17శాతం నుంచి 22 శాతం వరకు వేతనాలు పెంచి ఉద్యోగస్తులను తమ కంపెనీల్లోకి తీసుకున్నాయి. ఇక టీసీఎస్లో ఇది అత్యల్పంగా 10.9శాతంగా నమోదైంది. మరోవైపు ఇన్ఫోసిస్ లిమిటెడ్ 23 శాతం రికార్డు కాగా, కాగ్నిజెంట్, విప్రో కంపెనీలు వరుసగా 22.6శాతం, 17.7శాతం ఎక్కువగా వేతనాలు ఇచ్చి ఉద్యోగులను తీసుకున్నాయి.
వేతనాలు ఎక్కువగా ఇచ్చే భారత ఐటీ కంపెనీలు కొత్త టెక్నాలజీ లేదా డిజిటల్ టెక్నాలజీపై పట్టున్న వారికోసం వేట ప్రారంభించాయని ముంబైకి చెందిన బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగానే సెకండ్ లేదా థర్డ్ క్లాస్ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయని ఇదే తమ సర్వేలో వెల్లడైందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. టాప్ 100 కాలేజీలను వదిలేసి ఆపైన ర్యాంకింగ్లో ఉన్న కాలేజీలను టార్గెట్ చేసుకుని గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయని సంస్థ తెలిపింది. ఇలా చేయడంవల్ల యావరేజ్ ఇన్పుట్ కాస్ట్ స్థిరంగా ఉంటోందన్ని వెల్లడించింది.
ఐటీ సంస్థల కంటే నాన్ ఐటీ కంపెనీల వైపే మొగ్గు
44 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రముఖ సంస్థ జేఎం ఫైనాన్షియల్ జరిపిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళ్లగా కేవలం 10శాతం మంది మాత్రమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీవైపు ఆసక్తి చూపినట్లు సర్వే వెల్లడించింది. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉన్న 14శాతం మంది ఐటీ కంపెనీలు కాకుండా ఐటీయేతర కంపెనీల వైపే మొగ్గు చూపినట్లు సర్వే నిగ్గుతేల్చింది. ఇక సామూహిక రిక్రూట్మెంట్ల ద్వారా ఐటీ కంపెనీలు అభ్యర్థులను నియమించుకుంటోంది. వీరికి ఏడాదికి సగటున రూ.3.30 లక్షలు వేతనం ఇస్తుండగా అదే ఐటీయేతర కంపెనీలు ఏడాదికి సగటున రూ.5.06లక్షలు ఇస్తున్నాయని సర్వే పేర్కొంది.