21 విపక్ష పార్టీలు..పట్టువదలని విక్రమార్కులు: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంలో పిటీషన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ సహా దేశంలోని 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు పట్టు వదలని విక్రమార్కులు అయ్యారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తుది తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు ఈ పిటీషన్ పై సంతకాలు చేశారు. తీర్పును పున: సమీక్షించాలని కోరారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఒక్కో నియోజకవర్గంలో అయిదు ఈవీఎంల నుంచి వెలువడే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తుది తీర్పును వెలువడించింది. ఈ తీర్పుపై 21 ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ర్యాండమ్ గా అయిదు ఈవీఎంల స్లిప్పులను లెక్కించడం వల్ల ఉపయోగం ఉండదని, ఈ తీర్పును పున:సమీక్షించాలని, కనీసం 50 శాతం స్లిప్పులను లెక్కించేలా తుది తీర్పును జారీ చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాయి.
అసలు కథేంటీ?
పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసిన అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నుంచి వెలువడే స్లిప్పుల లెక్కింపు సంఖ్యపై కొంతకాలంగా 21 ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈవీఎంలపై ఏ బటన్ నొక్కినా, ఈ ఓటు బీజేపీకి పడుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఆయా పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలను రష్యా నుంచి హ్యాక్ చేస్తున్నారంటూ చంద్రబాబు కొత్త వాదన కూడా లేవదీశారు. ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేస్తోందని, దీన్ని నిరోధించడానికి వెరిఫికేషన్ ఆఫ్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ట్రయల్ (వీవీప్యాట్) స్లిప్పులను కూడా లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కిందటి నెల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు.
బీజేపీపై ట్యాంపర్ ఆరోపణలు..
ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, దీనికి ప్రధాన కారణం- ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించడం వల్ల బీజేపీకి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనే అంశంపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల మద్దతును కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉన్నందు వల్ల వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లనే ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్, టీడీపీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ ససేమిరా అనడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కనీసం 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు సరైన మార్గదర్శకం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఎన్నికల కమిషన్ వాదనేంటీ?
ప్రతిపక్ష నాయకుల వాదనకు భిన్నంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది తన వాదనను సుప్రీంకోర్టులో వినిపించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి ఏ మాత్రం కూడా అవకాశమే లేదని తేల్చారు. దీనిపై తాము ఇదివరకే ఓ బహిరంగ చర్చను చేపట్టామని, ఈవీఎంలను ప్రత్యక్షంగా ట్యాంపర్ చేసి, చూపించడానికి ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. దీనితోపాటు- ఓటు వేయడంలో భాగంగా.. బటన్ నొక్కగానే, తాను ఏ అభ్యర్థికి ఓటు వేశాననే విషయాన్ని తెలియజేయడానికి సదరు అభ్యర్థి, ఎన్నికల గుర్తుకు సంబంధించిన ఫొటోలు ఏడు సెకెన్ల పాటు ఈవీఎంలపై ప్రత్యక్షమౌతాయని కూడా ఈసీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. అయినప్పటికీ.. సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. నియోజకవర్గానికి ఒక ఈవీఎంకు బదులుగా అయిదింటిని లెక్కించాలని ఆదేశిస్తూ ఈ నెల 8వ తేదీన తీర్పు వెలువడించింది.