యువతుల పెళ్లి వయస్సు 21 ఏళ్లకు ? దశలవారీగా అమలు- కేంద్ర టాస్క్ఫోర్స్ ప్రతిపాదన
దేశవ్యాప్తంగా యువతుల పెళ్లి వయసుపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. దేశంలో యువకులకు 21 సంవత్సరాలుగా, యువతులకు 18 ఏళ్లుగా పెళ్లి వయసు ఉంది. దీన్ని సవరించి యువతులకు 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఎప్పటి నుంచో ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఫుల్స్టాప్ పెట్టేందుకు కేంద్రం ఓ ప్రత్యేక టాస్క్ఫోర్స్తో అధ్యయనం చేయించింది. ఈ టాస్క్ఫోర్స్ తాజాగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఇందులో యువతుల పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఇందుకు గల కారణాలను సైతం తన నివేదికలో సవివరంగా వెల్లడించింది.
యువతుల పెళ్లి వయసు 21 ఏళ్లకు...
యువతుల పెళ్లి వయసు పెంపుపై జరుగుతున్న చర్చకు ఫుల్స్టాప్ పడింది. దీనిపై కేంద్రం నియమించిన టాస్క్ఫోర్స్ గత నెలలోనే నివేదిక సమర్పించింది. ఇందులో యువతుల పెళ్లి వయసును ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలని టాస్క్ఫోర్స్ ప్రతిపాదించింది. అయితే ఇది దశల జరిగేలా చూడాలని కోరింది. సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ నేతృత్వంలోని ఈ టాస్క్ఫోర్స్ కేంద్రానికి చేసిన ప్రతిపాదనల్లో పలు కీలక సూచనలు చేసింది. ప్రధాని కార్యాలయంతో పాటు మహిళా, శిశు సంక్షేమశాఖకు సమర్పించిన ఈ నివేదికలో అంశాలపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
21 ఏళ్లకు యువతులకు పెళ్లి ఎందుకంటే
కనీసం 21 సంవత్సరాలకు యువతులకు పెళ్లి చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కేంద్రాన్ని టాస్క్ఫోర్స్ కోరింది. అయితే ఈ ప్రతిపాదన వెనుక సహేతుకమైన కారణాలను కూడా టాస్క్ఫోర్స్ పేర్కొంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా యువతుల సంక్షేమం దృష్ట్యా 21 ఏళ్ల వయసు వచ్చాకే పెళ్లి చేసుకునే అవకాశం కల్పించాలని సూచించింది. తక్కువ వయసులో పెళ్లిళ్లు చేస్తే ఆ వెంటనే గర్భం దాల్చడం, పౌష్టికాహార సమస్యలతో వారు బాధపడటం వంటి అంశాలను టాస్క్ఫోర్స్ దృష్టిలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. వీటికి ఉదాహరణగా పలు అధ్యయనాలను టాస్క్ఫోర్స్ తమ నివేదికలో పొందుపరిచింది.
21 ఏళ్లకు తొలి కాన్పు ఉండేలా ప్రతిపాదన
ఓ మహిళకు తొలి కాన్పు అయ్యే నాటికి 21 సంవత్సరాల కనీస వయసు ఉండేలా చూడాలని కేంద్రాన్ని ఈ టాస్క్ఫోర్స్ కోరినట్లు తెలుస్తోంది. అప్పుడే సదరు మహిళలు ఆరోగ్య సమస్యలతో పాటు సామాజిక, ఆర్ధిక, ఇతరత్రా సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుందని టాస్క్ఫోర్స్ తన అధ్యయనంలో తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో 50కి పైగా సగటు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో తక్కువ వయసుల్లో పెళ్లిళ్లు చేయడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం భారత్లో చూసినా 21 నుంచి 35 ఏళ్ల వయసులోనే మహిళలకు ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని, ఇలాంటి సందర్భాల్లో 27 నుంచి 29 ఏళ్ల మధ్య వయసులోనే మహిళలు ఎక్కువగా తొలిసారి గర్భం దాలుస్తున్నట్లు ఈ నివేదిక ఉదహరించింది. దీనిపై అధ్యయనం చేశాక కేంద్రం త్వరలో ఓ నిర్ణయం ప్రకటించనుంది.