పెరిగిన జన్ ధన్ ఖాతాలు.. 90వేల కోట్ల డిపాజిట్లు..!
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ధన్ యోజనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 2014 ఆగస్టు 28న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన జన్ధన్ యోజన.. నాలుగున్నరేళ్లలో మంచి మార్కులు కొట్టేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం జనవరి 30వ తేదీ నాటికి.. జన్ ధన్ యోజన ఖాతాల్లో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తం 89 వేల 257 వందల 57 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది త్వరలోనే 90 వేల కోట్ల రూపాయలు దాటనుండటం విశేషం.
మొదట్లో జన్ ధన్ యోజన కింద ఖాతాలు తీసుకున్నవారికి లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది ఆగస్టు 28 తర్వాత ఆ మొత్తం 2 లక్షల రూపాయలకు పెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతాలు తీసుకునేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.
జన్ ధన్ యోజన ప్రారంభించిన మొదట్లో ఒక్క ఇంటికి ఒక్క ఖాతా మాత్రమే తెరిచే వీలుండేది. అనంతరం ప్రతి వ్యక్తికి ఓ ఖాతా అన్నట్లుగా రూల్స్ సవరించారు. ఇది కూడా ఖాతాల సంఖ్య పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 30 కోట్లకు పైగా ఖాతాలు తెరిచినట్లు సమాచారం. 2014 ఆగస్టు 28న జన్ ధన్ యోజన ప్రారంభించినప్పటికీ.. 2017, మార్చి నుంచి ఖాతాల్లోకి జమ చేసే మొత్తం పెరుగుతూ వచ్చింది.