ప్రొటోకాల్ ఉల్లంఘించిన మోడీ: సెక్యూరిటీని బెంబేలెత్తించిన ‘నల్ల పతంగి’
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని భద్రతా సిబ్బందిని ఓ పతంగి బెంబేలెత్తించింది. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దేశరాజధానిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
కలకలం రేపిన నల్ల పతంగి
చారిత్రక ఎర్రకోట వద్ద 9,100 మంది సిబ్బందితో భద్రత చేపట్టారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించే వేదిక పోడియం వద్దకు నల్లని పతంగి ఎగురుకుంటూ వచ్చింది. అది ప్రధాని ప్రసంగానికి ఎలాంటి ఆటంకం కలింగించకుండా పోడియం కింద ఆగిపోయినప్పటికీ భద్రతాధికారులు మాత్రం ఆందోళన చెందారు.
ప్రొటోకాల్ ఉల్లంఘన
మంగళవారం ఉదయం ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రొటోకాల్ను పక్కన పెట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఉరుకులు పెట్టాల్సి వచ్చింది.
పిల్లలతో మమేకమై..
తన ప్రసంగం ముగిసిన తరువాత, వేదిక దిగి కిందకు వచ్చిన మోడీ, అక్కడే ఉండి జాతీయ గీతాలను పాడి ఆహూతులను అలరించిన చిన్నారుల మధ్యకు వచ్చారు. ఆనందంగా వారిని పలకరించి ప్రేమను కురిపించారు.
పరుగెత్తుకు వచ్చిన చిన్నారులు..
చిన్నారులు సైతం మోడీతో ఫోటోలు దిగాలన్న ఉత్సాహాన్ని చూపించారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పరుగెత్తుకుంటూ వచ్చారు. సోమవారమే కృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకున్న పలువురు చిన్నారులు కృష్ణుని వేషంలోనే ఎర్రకోట వద్దకు రాగా, వారిని మోడీ పలకరించారు.
శ్రమించిన సెక్యూరిటీ సిబ్బంది..
చిన్నారుల మధ్యకు మోడీ వెళ్లిన సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టిన పిల్లలను అదుపు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఆపై అందరికీ అభివందనం చేస్తూ.. మోడీ తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, గతంలో కూడా పలుమార్లు మోడీ ప్రొటోకాల్ను పక్కనపెట్టిన విషయం తెలిసిందే.