పాకిస్థాన్ బుద్ధి చూపినా..: ఇమ్రాన్ ఖాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతూ ఉండే దాయాది దేశం పాకిస్థాన్ గత కొంత కాలం క్రితం మన విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ దేశానికి మన దేశ గగన తలం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, భారత్ మాత్రం పాపిస్థాన్లా వ్యవహరించలేదు. అనుమతులిచ్చేసింది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి శ్రీలంక షాక్: నరేంద్ర మోడీ అంత రేంజ్ కాదు!, మరో కారణం కూడా
శ్రీలంక పర్యటనకు వెళ్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానం భారత్ మీదుగా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పాక్ విమానం భారత గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి కల్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
సాధారణంగా వీవీఐపీ విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అన్ని దేశాలు అనుమతిస్తాయి. కానీ, పాక్ మాత్రం గతంలో భారత్ కోరితే అంగీకరించలేదు. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అవాస్తవాలు ప్రచారం చేసి, దొంగ ఏడుపులు ఏడ్చి.. 2019లో భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా నిషేధం విధించింది.
భారత ప్రధాని మోడీ వెళ్లే వీవీఐపీ విమానానికి కూడా అనుమతి నిరాకరించడం గమనార్హం. పాక్ మీదుగా అమెరికా, సౌదీ అరేబియా వెళ్లేందుకు మోడీ విమానానికి నిరాకరించింది. దీంతో మరో మార్గంలో ఆ విమానం వెల్లింది. పాక్ వ్యవహారంపై భారత్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు ఫిర్యాదు కూడా చేసింది.
కాగా, రెండ్రోజుల పర్యటన నిమిత్తం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం శ్రీలంక వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అయితే, శ్రీలంక పార్లమెంటులో ఇమ్రాన్ ప్రసంగం చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసింది. భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండటంతో శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.