షాకింగ్:బందీలుగా చిక్కిన చైనా సైనికులు.. 40మంది హతమయ్యారన్న కేంద్ర మంత్రి..
సరిహద్దులో దశాబ్దాల ఒప్పందాలను ధిక్కరిస్తూ గత వారం చైనా హత్యాకాండకు పాల్పడటం, 20 మంది భారత సైనికులు కిరాతకంగా చంపడంతోపాటు మరో 76 మందిని తీవ్రంగా గాయపర్చిన తర్వాత డ్రాగన్ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని భారత్ నిర్ణయించుకున్నది. కాగా, గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో చైనా వైపు ఎంత మంది చనిపోయారనే దానిపై తొలిసారి ఓ కేంద్ర మంత్రి నోరువిప్పారు. అంతేకాదు, చైనా సైనికులు మనకు బందీలుగా చిక్కారన్న షాకింగ్ విషయాన్నీ ఆయన బయటపెట్టారు. సదరు మంత్రి జనరల్ వీకే సింగ్ మాజీ ఆర్మీ చీఫ్ కూడా కావడంతో ఆయన వ్యాఖ్యలకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
Recommended Video
ఇక చైనా ఖేల్ ఖతం.. త్రివిధ దళాలకు సంచలన ఆదేశాలు.. డ్రాగన్ తోకజాడిస్తే కత్తిరించాలంటూ..
ఆ రాత్రి ఏమైందంటే..
‘‘గత సోమవారం(ఈనెల 15న) రాత్రి గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న సంఘటనలపై భారత మీడియా ఒకవైపు వార్తలనే ప్రసారం చేసింది. నిజానికి నాటి ఘటనలో చైనాకు చెందిన 40 మంది సైనికులు కూడా హతమయ్యారు. అంతేకాదు, మనవాళ్లలో కొందరిని వాళ్లు చెరలోకి తీసుకున్నట్లే.. చైనా సైనికుల్ని సైతం భారత బలగాలు బంధించాయి. చర్చల తర్వాత వాళ్లు మనోళ్లను విడుదల చేసినట్లే.. మనం కూడా చైనా సైనికుల్ని వదిలేశాం. కానీ ఈ వార్తలు ఎక్కడా రిపోర్టు కాలేదు''అని మంత్రి వీకే సింగ్ తెలిపారు. శనివారం రాత్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
‘పీపీ 14' మన ఆధీనంలోనే..
గాల్వాన్ లోయలో హింస తర్వాత చైనా ఆర్మీ, విదేశాంగ శాఖలు ప్రకటించుకున్నట్లుగా అక్కడి ప్రాంతమేదీ వాళ్ల ఆధీనంలో లేదని, ప్రధానంగా చైనా క్లెయిమ్ చేసుకుంటోన్న 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ14) ఇప్పటికీ మన ఆధీనంలోనే ఉందని వీకే సింగ్ స్పష్టం చేశారు. పీపీ15 విషయానికొస్తే.. ప్రతి ఏడాది దాన్ని ఆక్రమించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నదని, ప్రతిసారి మనవాళ్లు ధీటుగా ఎదుర్కొంటూ వస్తున్నారని వివరించారు. పీపీ 14 వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో రెండు వైపులా కలిపి సుమారు 600 మంది సైనికులు పాల్గొనిఉండొచ్చని చెప్పారు. గాల్వాన్ లో హింస, ఆక్రమణలు, చైనా వైపు మరణాలపై ఓ కేంద్ర మంత్రి మాట్లాడటం ఇదే తొలిసారి.
1962లో ఇదే తీరు..
‘‘తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో తమవైపు ఎంత మంది సైనికులు చనిపోయారనే విషయాన్ని చైనా వెల్లడించలేదు. ఈ ఒక్క సందర్భంలోనేకాదు.. 1962 యుద్ధంలోనూ చైనా ఇదే రీతిగా వ్యవహరించింది. నాడు రెండు వైపులా కలిపి దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోగా, చైనా మాత్రం తాను కేవలం 200 మంది సైనికుల్నే పోగొట్టుకున్నట్లు బుకాయించింది''అని వీకే సింగ్ గుర్తుచేశారు.
ఆ దారిలో దెబ్బకొట్టాలి..
సరిహద్దుకు సంబంధించి సైనిక పరంగా చేసుకున్న ఒప్పందాలను భారత్ ఎన్నటికీ అతిక్రమించబోదని, అయితే, చైనాను కచ్చితంగా దెబ్బకొట్టాల్సిన ప్రస్తుత తరుణంలో మనం ఆర్థిక అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘చైనాను ఏ విధంగా కట్టడి చేయాలనేదానిపై ఇప్పుడు ప్రజలే ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే ‘‘చైనా వస్తువుల బహిష్కరణ'' పిలుపు. చైనాతో యుద్ధం చేయడం అనేది చిట్టచివరి ఆప్షన్. దానికంటే ముందు డ్రాగన్ దేశాన్ని ఆర్థికపరంగా దెబ్బకొట్టాలి. అందుకు చైనా వస్తువుల బహిష్కరణ మంచి ఎత్తుగడ అవుతుంది''అని జనరల్ వీకే సింగ్ అన్నారు.