చైనా హింసపై ప్రధాని మోదీ సంచలనం.. భారత్ సత్తా ప్రపంచానికి తెలుసు.. 2020 చెడ్డ ఏడాది కాబోదంటూ..
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభణ.. అంతలోనే పెనుతుపాన్ల విధ్వంసం.. మరోవైపు మిడతల దాడి.. ఇవి చాలదన్నట్లు సరిహద్దులో చైనా హింసాత్మక దాడులు.. అసలేం జరుగుతోంది? భారత్ పై కాలం పగబట్టిందా? 2020 సంత్సరం దేశానికి శాపంగా మారిందా? ఏ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నా.. ఎక్కడ జనం గుమ్మికూడినా ఇదే చర్చ.. దేశం సంకట స్థితిలో ఉందన్న భావన.
Recommended Video
అయితే, సవాళ్లను చూసి బెదిరిపోరాదని, చరిత్ర పొడవునా ఇబ్బందులు ఎదుర్కొన్నా దీటుగా నిలబడ్డ దేశం మనదని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. చైనాతో గొడవలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్..
గడిచిన రెండు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా కవ్వింపులకు పాల్పడుతుండటం, రెండు వారాల కిందట తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత బలగాలపై కిరాతకంగా దాడి చేసి, 20 మందిని చంపేసిన ఘటన తర్వాత ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. చైనాపై ప్రతీకారం తీర్చుకుందామంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమైంది. జవాన్ల మరణాలపై స్పందిస్తూ ‘‘దీటుగా బదులిస్తాం''అన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం నాటి మన్ కీ బాత్ లోనూ చైనాకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
భారత్ సత్తా ప్రపంచానికి తెలుసు..
‘‘అందరితోనూ సఖ్యతగా మెలిగే దేశం మనది. నిజమైన స్నేహానికి మనం ఎంతగా ప్రాధాన్యం ఇస్తామో.. తోకజాడింపులకు పాల్పడేవాళ్లకు అంతే దీటుగా బదులివ్వగలం. ఇండియా బలపరాక్రమాల గురించి, శాంతి పట్ల మనం చూపించే అసాధారణ నిబద్ధత గురించి ప్రపంచానికి తెలుసు. మాతృభూమి సంరక్షణలో నేలకొరిగిన అమరవీరులకు దేశం నమస్కరిస్తున్నది. వారి శౌర్యప్రతాపాలు ఎప్పుటికీ గుర్తుండిపోతాయి. వారి త్యాగం వృథాకాబోదు..'' అని ప్రధాని మోదీ అన్నారు.
అది చేసి చూపించాం..
పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకునే సామర్థ్యం ఇండియాకు ఉందంటూనే... శత్రువులను ఎలా చూసుకోవాలో కూడా తెలుసంటూ చైనాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన చైనాకు దీటుగా బదులిచ్చామని స్పష్టం చేశారు. ‘‘లడఖ్ ప్రాంతంలో సవాళ్లు విసిరినవాళ్లకు దీటైన జవాబునే ఇచ్చాం'' అని మోదీ పేర్కొన్నారు. కాగా, పెద్ద సంఖ్యలో జవాన్లను కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత త్యాగాలు చేసిన మన వీరజవాన్లు... విరోధులను గెలవనీయకుండా చేశారు..''అని ప్రధాని వ్యాఖ్యానించారు.
ప్రతిదానికీ 2020తో ముడిపెట్టొద్దు..
కరోనా వైరస్, అంపన్, నిసర్గ తుపాన్లు, సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఇలా ఒకేసారి అనేక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టిన తరుణంలో.. 2020ని ‘చెడ్డ సంవత్సరం'గా చాలా మంది భావిస్తుండటం తన దృష్టికి వచ్చిందని, సవాళ్లు ఎదురైనప్పుడు స్థిరంగా పోరాడాలే తప్ప సంవత్సరాలను నిందించడం వల్ల ఉపయోగం ఉండదని, కాబట్టి 2020ని చెడ్డ సంవత్సరంగా భావించరాదని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘2020లో మాత్రమే మనం సమస్యలు ఎదుర్కొంటున్నామా? కానేకాదు, ప్రతి సందర్భంలోనూ భారత్ సవాళ్లను తట్టుకుని నిలబడింది. సమస్యలకు సృజనాత్మక రీతిలో సమాధానాలు వెతుక్కుంది. ఇప్పుడు కూడా మనం అదే స్ఫూర్తిని కొనసాగించాలి. 130 కోట్ల మందిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది..''అని మోదీ భరోసా ఇచ్చారు.
పిల్లల నుంచి ప్రామిస్ కోరిన ప్రధాని..
కరోనా లాంటి విశ్వమహమ్మారి ఒకటి పుడుతుందని, దానిపై ఇంత భారీ ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదని, అయితే, ఉత్పాతం ఉద్భవించిన వెంటనే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి, ఐక్యంగా పోరాడుతుండటం గొప్ప విషయమని మోదీ గుర్తుచేశారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటూనే, ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడేలా ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నదిని, ఇలాంటి కీలక తరుణంలో ప్రజలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ప్రధాని కోరారు. సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు, మాస్కులు ధరించడాన్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. దేశంలోని చిన్న పిల్లలందరూ.. తమ ఇంట్లోని వృద్ధుల్ని బయటికి రానీయకుండా చూసుకుంటామని ప్రామిస్ చేయాలంటూ మోదీ కోరారు.
పీవీ యాదిలో మోదీ..
భారత మాజీ ప్రధాని, తెలుగువారైన పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా మోదీ తన మన్ కీ బాత్ లో పీవీని గుర్తుచేసుకున్నారు. అనేక సవాళ్లు చుట్టుముట్టిన కఠిన సమయంలో దేశాన్ని అద్భుతంగా నడిపించిన నాయకుడంటూ పీవీని కీర్తించారు. ‘‘భూమిపుత్రుడు పీవీ నర్సింహారావును దేశం కలకాలం గుర్తుంచుకుంటుంది. కీలకమైన సమయంలో ఆయన దేశానికి నాయకత్వం వహించారు. గొప్ప రాజకీయవేత్తగానే కాదు, పండితుడిగానూ ఆయన మన్ననలు పొందారు. చిన్నవయసు నుంచే వినయవిధేయలతతో పెరిగిన పీవీ.. భారత ఆత్మను ఒడిసిపట్టుకోవడంతోపాట పాశ్చాత్య ఆలోచనా విధానాల్లోనూ ప్రావిణ్యం సాధించారు. ఆ మహనీయుడి చరిత్ర గురించి అందరూ ఇంకా చదువుతారని ఆశిస్తున్నాను..''అని ప్రధాని మోదీ అన్నారు.