Coronavirus : కరోనా ముప్పు పొంచివున్న దేశాల జాబితాలో భారత్ ఏ స్థానంలో ఉందంటే..
Recommended Video
చైనా నుంచి కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్ 17వ స్థానంలో ఉన్నట్టు జర్మనీ హాంబోల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 4,000 విమానాశ్రయాలు.. వాటికి సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్ సరళిని విశ్లేషించడం ద్వారా నిర్వహించిన అధ్యయనం ద్వారా కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న 20 దేశాల జాబితాను రూపొందించారు. ఈ అధ్యయనంలో భారత్కు కరోనా వైరస్ ముప్పు 0.219శాతంగా ఉన్నట్టు తేలింది.
చైనాలో కరోనా వైరస్ బారినపడివారు.. అక్కడినుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా దేశాలకు కరోనా విస్తరించే ప్రమాదం ఏర్పడింది. అయితే చైనీయులు ప్రయాణిస్తున్న విదేశాల జాబితాలో భారత్ దాదాపుగా చివరి స్థానంలో ఉందనే చెప్పాలి. ఉదాహరణకు చైనాలోని హాంగ్ఝౌ విమానశ్రయానికి సంబంధించిన ట్రాఫిక్ను పరిగణలోకి తీసుకుంటే.. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ప్రయాణం సాగిస్తున్న చైనీయుల్లో కేవలం 0.66శాతం మంది ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు,0.034శాతం మంది ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్, 0.020శాతం మంది కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్టుకు ప్రయాణిస్తున్నారు.
హాంగ్ఝౌ నుంచి విదేశాలకు బయలుదేరుతున్నవారిలో ప్రతీ 1000మందిలో 0.2శాతం జర్మనీకి వెళ్తున్నట్టు గుర్తించారు. అంటే, సగటున ఇద్దరు జర్మనీకి వెళ్లే అవకాశం ఉందని నిర్దారించారు. కాగా,చైనాలో కరోనా వైరస్ మృతులు సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సోమవారం నాటికి మృతుల సంఖ్య 813కి చేరింది. మొత్తం 37,558మందికి ఈ వైరస్ సోకింది. దాదాప 28 దేశాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటివరకు ఈ వైరస్ కారకాలపై కచ్చితమైన నిర్దారణలేవీ వెలుగుచూడలేదు. గబ్బిలాల నుంచి వ్యాప్తి చెంది ఉండవచ్చునన్న ప్రచారంతో పాటు అలుగు జంతువుల నుంచి కూడా ఇది వ్యాప్తి చెంది ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.