State Startup Rankings విడుదల: గుజరాత్ టాప్.. మరి తెలంగాణ ర్యాంకు ఎంతంటే..?
కరోనావైరస్ నేపథ్యంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను ట్రాక్పై పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషిచేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో కేంద్రం పలు ఆర్థిక పరమైన సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. ఇక వీలైనంత వరకు ప్రపంచ దేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే ఉన్న వనరులతో మనమే ఉత్పత్తులను తయారు చేసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఇచ్చారు. స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను మనమే ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రధాని పదేపదే చెబుతున్నారు. ఇక స్టార్టప్ కంపెనీలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం కోసం పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలను ప్రోత్సహించే భాగంలో స్టార్టప్ ర్యాంకింగ్లను విడుదల చేసింది.
స్టార్టప్ ర్యాంకులు విడుదల
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే క్రమంలో ఆయా రాష్ట్రాలకు స్టార్టప్ ర్యాంకులను ప్రకటించింది కేంద్రం. స్టార్టప్ ర్యాంకింగ్ రెండో ఎడిషన్లో భాగంగా తొలిస్థానంలో గుజరాత్ నిలువగా ఆ తర్వాతి స్థానంలో కర్నాటక కేరళలు నిలిచాయి. వాణిజ్యం పరంగా ఆయా రాష్ట్రాలు తమ సామర్థ్యం మేరకు సొంతంగా నిలుదొక్కుకోవాలని, అలాంటి వాతావరణం రాష్ట్రాల్లో కనిపించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సహిస్తోంది. రాష్ట్రస్థాయిలో కొత్త సంస్థల ఏర్పాటు మరియు ఎంట్రప్యూనర్షిప్ అవకాశాలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే 2019కి గాను ఆయా రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్స్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఐదు కేటగిరీల్లో ర్యాంకులు
పర్యావరణ విభాగంలో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీలు వరుసగా ఛత్తీస్గఢ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, సిక్కిం, నాగాలాండ్, మిజోరాం, మధ్యప్రదేశ్ అస్సాం రాష్ట్రాలు నిలిచాయి. ఇక స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో ఔత్సాహిక నాయకత్వం పోషిస్తున్న రాష్ట్రాల్లో ముందుగా పంజాబ్ నిలువగా ఆ తర్వాత తెలంగాణ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలు నిలిచాయి. ఇక లీడర్స్ విభాగంలో మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, రాజస్థాన్, చండీగఢ్ నిలిచాయి. అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో ముందుగా కర్నాటక ఆ తర్వాత కేరళ రాష్ట్రాలు నిలిచాయి. ఇక బెస్ట్ పెర్ఫార్మర్స్ కేటగిరీలో అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్ రాష్ట్రాలు ముందు వరసలో నిలిచాయి.
మూడు సూచనలు చేసిన పీయూష్ గోయల్
స్టార్టప్ కంపెనీలను వృద్ధి చేసేందుకు ఆయా రాష్ట్రాలు తీసుకున్న చొరవను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. స్టార్టప్స్ కోసం మూడు సూచనలు చేశారు. ముందుగా ఉత్పత్తి గురించి చెప్పిన ఆయన స్టార్టప్ కంపెనీలు ఉత్పత్తిని ఏ రకంగా వృద్ధి చేయగలం, ఎలా ఉపయోగపడుతాయి, ఈ రోజు పరిస్థితికి ఉత్పత్తులు ఎలా పనికొస్తాయనేదానిపై ఫోకస్ చేయాలన్నారు. రెండోదిగా ప్రక్రియ గురించి చెప్పారు. ఉత్పత్తులను అవసరాలకు అనుగుణంగా తిరిగి ఎలా రీడిజైన్ చేయాలనేదానిపై స్టార్టప్లు దృష్టి సారించాలని చెప్పారు. ఇక మూడోదిగా ప్రజలకు ఆ ఉత్పత్తులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయనేదానిపై కూడా ఫోకస్ చేయాలని చెప్పారు.
2025 నాటికి ప్రత్యక్షంగా 1.1 మిలియన్ ఉద్యోగాలు
ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ శాఖ ఆధ్వర్యంలో స్టార్టప్ ర్యాంకింగ్లు తయారు చేయడం జరిగింది. మొత్తం ఏడు కేటగిరీల్లో ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం భారత్లో 50వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 9,300 కంపెనీలు టెక్ స్టార్టప్ కంపెనీలు కావడం విశేషం. మరో 1600 వందలు క్లిష్టమైన టెక్ స్టార్టప్ కంపెనీలు. 2025 నాటికి భారత్లోని టెక్ స్టార్టప్ కంపెనీలు 100 పెద్ద సంస్థలుగా మారుతాయని 1.1 మిలియన్ మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని నాస్కామ్ జిన్నావ్ సంస్థ పేర్కొంది.