కరోనా పోరాటంలో ముందున్నాం, ప్రపంచం ప్రశంసిస్తోంది: అమిత్ షా
గరుగ్రామ్: కరోనాపై పోరులో భారత్ ముందుందని, ఈ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్తు ప్రపంచం ప్రశస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కరోనాపై చేస్తున్న కృషిలో భద్రతా బలగాల కృషి మరువలేనిదని అన్నారు. గురుగ్రామ్లోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆదివారం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
130 కోట్ల జనాభా కలిగిన భారత్ కరోనాతో ఎలా పోరాడుతుందోనని అనేక అనుమానాలుండేవి.. కానీ ఈరోజు కరోనాపై మనం విజయవంతంగా చేస్తున్న యుద్ధాన్ని చూసి యావత్తు ప్రపంచం ప్రశంసిస్తోంది. ఈ పోరులో మన భద్రతా బలగాల కృషి ఎనలేనిదని అమిత్ షా అన్నారు.
కరోనా కట్టడి కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఉగ్రవాదుల పైనేగాక కరోనా వంటి మహమ్మారులపైనా ఎంత సమర్థంగా పోరాడగలమో నిరూపించారు. ఈ క్రమంలో కొంత మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారందరికీ ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు అమిత్ షా చెప్పారు. ఇప్పటికే వారి కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. కరోనాపై చేస్తున్న పోరు చరిత్రలో నిలిచిపోతుందని అమిత్ షా అన్నారు. ఆ చరిత్ర జవాన్ల త్యాగం సువర్ణాక్షరాలతో లిఖిస్తారని అమిత్ షా చెప్పారు.
Recommended Video
కాగా, గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు మొక్కలు నాటడమే పరిష్కారమని అమిత్ షా అన్నారు. సీఏపీఎఫ్ నేతృత్వంలో ఆదివారం 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జులై నెలాఖరు నాటికి 1.37 కోట్ల మొక్కలు నాటుతామని వెల్లడించారు.