అఖండ భారత్కు అహింసతోనే స్వాతంత్య్రం... తెల్ల దొరలకు చెమటలు పట్టించిన ఉద్యమాలు
న్యూఢిల్లీ: భారత దేశం 75వ స్వాతంత్ర దినోత్సవంను ఆగష్టు 15న జరుపుకోనుంది. ఏటా ఆగష్టు 15వ తేదీన దేశం ఘనంగా స్వాంతంత్ర్య వేడుకలను నిర్వహిస్తుంది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి 1947 ఆగష్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందింది. దేశం తెల్లదొరల పాలన నుంచి సొంత పాలన వైపు అడుగులు వేసిన రోజు ఇది. అంతేకాదు దేశం రెండుగా విడిపోవడం కూడా జరిగింది. ఒకటి భారత దేశంగా మిగిలిపోగా మరొకటి పాకిస్తాన్గా ఏర్పాటు కావడం జరిగింది.
భారత్లో బ్రిటీష్ పాలన 1757 నుంచి ప్రారంభమైంది. ప్లాసీ యుద్ధం విజయంతో భారత్లో తెల్లదొరల పాలన ప్రారంభమైంది. క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని తన అధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ను 100 ఏళ్లకు పైగా పాలించింది. ఆ తర్వాత 1857-58 మధ్య జరిగిన యుద్ధం ద్వారా బ్రిటీష్ రాజ్యం చేతిలోకి భారత్ వెళ్లిపోయింది. మొదటి ప్రపంచ యుద్దం సమయంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభమైంది. దీనికి మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ నాయకత్వం వహించారు. అహింసా మార్గాన్ని ఎంచుకుని తెల్ల దొరలను ఎదిరించాడు. తను నమ్ముకున్న శాంతి అహింసా మంత్రాలతోనే అఖండ భారత్కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు.
ఇక భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశం మొత్తం జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేస్తుంది. జాతీయ గీతంను ఆలపించి జెండా వందనం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాటి త్యాగమూర్తులను స్మరించుకుంటుంది. అంతేకాదు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఢిల్లీలోని చారిత్రాత్మకమైన ఎర్ర కోటపై భారత ప్రధాని జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఎర్రకోట వద్ద త్రివిధ దళాలు మార్చ్పాస్ట్ నిర్వహిస్తాయి. ప్రధాని తన ప్రసంగంలో దేశం సాధించిన విజయాల గురించి చెబుతారు. అంతేకాదు భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే సవాళ్లపై కూడా మాట్లాడుతారు.